Friday, March 7, 2025

రూ.1,500 కోట్లతో భారీ ప్లాంట్

- Advertisement -
- Advertisement -

తుక్కుగూడలో లెన్స్‌కార్ట్ కళ్లజోళ్ల పరిశ్రమకు శంకుస్థాపన సుమారు 2వేల మందికి
ఉపాధి అవకాశాలు రెండేళ్లలో ఉత్పత్తి ప్రారంభం తెలంగాణ రైజింగ్‌లో
భాగస్వాములు కండి పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ లో పెట్టుబడులు పెట్టి ‘తెలంగాణ రైజింగ్’ లో భాగస్వాములు కావాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహిస్తూ తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. రూ.1500 కోట్లతో వ్య యంతో ఏర్పాటు చేయబోయే లెన్స్‌స్కార్ట్ కం పెనీ ప్లాంట్‌కు మంత్రి చేతుల మీదుగా గురువారం శంఖుస్థాపన జరిగింది. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ ఈ ప్లాంట్‌కు ప్రభుత్వం తరఫున తుక్కుగూడ సమీపంలో రావిర్యాలలో 50 ఎకరాలు కేటాయించామని తెలిపారు. ఈ కంపెనీ ఏర్పాటుతో సుమారు రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఇప్పటి కే లెన్‌స్కార్ట్‌కు రాజస్థాన్‌లో అధునాతన కళ్లజోడు తయారీ యూనిట్ ఉందని, అయితే తెలంగాణలో ఏర్పాటు కాబోయే ప్లాంట్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్ అని అన్నారు.

అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు కానున్న ఈ ప్లాంట్ తెలంగాణకు తలమానికం అవుతుందని ఆయన పేర్కొన్నారు. తయారీ రంగంలో తెలంగాణను ఈ ప్లాంట్ మరింత ముందుకు తీసుకెళుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల పరిస్థితులున్నాయన్న మంత్రి శ్రీధర్‌బాబు పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని తెలిపారు. లెన్స్ కార్ట్ ప్రపంచంలోనే అతి పెద్ద కళ్లజోడుల తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. దీంతో తెలంగాణ బ్రాండ్ విశ్వ వ్యాప్తం అవుతుందని వెల్లడించారు. ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, లెన్‌స్కార్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య గతేడాది డిసెంబర్ 8న ఒప్పందం (ఎంఓయు) కుదిరిందని అన్నారు.

-రెండేళ్లలో ఉత్పత్తి ప్రారంభం
లెన్ స్కార్ట్ కంపెనీ ప్లాంట్ రెండేళ్లలో ఉత్పత్తి ప్రారంభిస్తుందని అన్నారు. నాలుగేళ్లలో పూర్తిగా కార్యకలాపాలు మొదలవుతాయని తెలిపారు. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులు జపాన్, సింగపూర్, థాయ్‌లాండ్, తైవాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా, వియత్నాం, యుఏఈ, సౌదీ అరేబియా దేశాలకు ఎగుమతి అవుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, లెన్స్ కార్ట్ ప్రతినిధులు చౌదరి, సుమిత్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News