తెలంగాణలో త్వరలో మద్యం ధరలు పెరగనున్నాయి. ఇటీవలే బీర్ల ధరలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇతర మద్యం ధరలను కూడా పెంచడానికి సిద్ధమవుతోంది. అయితే.సామాన్య ప్రజలు ఎక్కువగా తాగే ‘చీప్ లిక్కర్’ ధరలను మాత్రం పెంచే ఆలోచన లేదని తెలుస్తోంది. కేవలం అధిక ధర కలిగిన మద్యంపై స్వల్పంగా ధరలు పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై ఎక్సైజ్ శాఖ అధికారులు లోతుగా చర్చిస్తున్నారు. మార్కెట్ ధరల ఆధారంగా ఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. మద్యం ధరలను పెంచడానికి రెండు లేదా మూడు రకాల ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఏ విధానాన్ని అమలు చేస్తే ఎంత అదనపు ఆదాయం వస్తుందన్న వివరాలను కూడా ఈ నివేదికలో స్పష్టంగా తెలియజేయనున్నట్టుగా సమాచారం. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటుంది. బాటిల్ రేటు ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ ఉన్న లిక్కర్పై కనీసం 10 నుంచి 15 శాతం అదనంగా ధరలు పెంచాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.
ధరల పెంపుతో సుమారుగా రూ.2 వేల కోట్ల ఆదాయం
గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు 30 వేల కోట్లకు పైగా మద్యంపై ఆదాయం వచ్చింది. ఈ ధరల పెంపు ద్వారా రాష్ట్ర ఖజానాకు ఏడాదికి దాదాపు రూ. 2,000 కోట్ల అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలను దాదాపు 15 శాతం వరకు పెంచింది. దీనివల్ల ఒక్కో బీరుపై సగటున రూ. 20 నుంచి రూ. 30 వరకు ధర పెరిగింది. ముడి సరుకుల ధరలు పెరగడం, ఉత్పత్తిదారుల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఐదేళ్ల తర్వాత బీర్ల ధరల పెంపుకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకుంది. పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం ధరలను అధ్యయనం చేసిన ఒక ప్రత్యేక కమిటీ కూడా ధరల పెంపునకు అనుకూలంగా నివేదిక సమర్పించింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టెట్రా ప్యాకెట్ల ద్వారా మద్యం అమ్మకాలు చేపట్టే అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టుగా తెలిసింది. అయితే ఈ ప్రతిపాదనలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఆమోదం లభిస్తేమొదట మహబూబ్నగర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసి ఆ తర్వాత వచ్చే ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది.