ఎపిలో పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్న లోన్ యాప్ ముఠా అరెస్టు చేశారు. లోన్ యాప్ల ద్వారా ఆర్థిక నేరాలకి పాల్పడుతోన్న ముఠా గుట్టును విశాఖ నగర పోలీసులు రట్టు చేశారు. అందుకు సంబంధించి ఇన్వెస్టమెంట్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడుతో సహా 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే రూ.60 లక్షల విలువైన క్రిఫ్టో కరెన్సీని పోలీసులు సీజ్ చేశారు. ఆదివారం విశాఖపట్నంలో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రూ.2 వేలు లోన్ యాప్లో అప్పు తీసుకున్న నరేంద్రను వేధించిన కేసులో పురోగతి సాధించినట్లు తెలిపారు. నరేంద్ర భార్య ఫోటోలను మార్ఫింగ్ చేసి సైబర్ నేరగాళ్లు బంధువులకు పంపారన్నారు. ఆ అవమాన భారంతో పెళ్లయిన 40 రోజులకు నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు. ఈ లోన్ యాప్ను ఈ ముఠా పాకిస్థాన్ కేంద్రంగా నడుపుతోనట్లు గుర్తించామని వెల్లడించారు.
దీని ద్వారా దాదాపు రూ.200 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని చెప్పారు. సుమారు భారత్ నుంచి 9 వేల మంది బాధితులు ఈ ముఠా చేతిలో మోసపోయినట్టు గుర్తించామని స్పష్టం చేశారు. ఈ ముఠా నుంచి 18 మొబైల్ ఫోన్లు,ఒక ల్యాప్ టాప్,54 సెల్ ఫొన్ సిమ్ములు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. విశాఖపట్నం మహారాణి పేట అంగటిదిబ్బ ప్రాంతానికి చెందిన ఎస్ నరేంద్ర ఆన్లైన్ లోన్ యాప్లో కొంత మొత్తంలో నగదు అప్పు తీసుకున్నాడు. రూ.2 వేలు మినహా మిగిలినదంతా చెల్లించాడు. కానీ ఆ రూ.2 వేల కోసం అతడిని లోన్ యాప్ నిర్వాహకులు వేధించడం ప్రారంభించారు.అతడి భార్య ఫోన్కు మార్ఫింగ్ ఫొటోలు పంపి నరేంద్రతో వెంటనే నగదు కట్టించాలని, లేకుంటే మరిన్ని ఫొటోలు పంపిస్తామని బెదిరించారు. హతాశురాలైన ఆమె ఏం జరిగిందని భర్తను నిలదీయగా లోన్ యాప్ వాళ్లకు రెండు వేలు చెల్లించాలని చెప్పాడు.
తమ వద్ద ఉన్న రూ.2 వేలు వెంటనే చెల్లించేశారు.అప్పటికే యాప్ నిర్వాహ కులు మార్ఫింగ్ ఫొటోలను నరేంద్ర ఫోన్ కాంటాక్ట్ లిస్టులో ఉన్న వాళ్లందరికీ పంపించేశారు. దాన్ని తీవ్ర అవమానంగా నరేంద్ర భావించాడు. భార్య నిద్రలో ఉండగా అతడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.నరేంద్ర.. ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ వివా హం జరిగి 40 రోజులైంది. దంపతులిద్దరూ చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.