Friday, September 20, 2024

ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి: పొంగులేటి

- Advertisement -
- Advertisement -

ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలి
దళారుల ప్రమేయం లేకుండా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి
సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ పై తీసుకోవాలి
జిల్లా కలెక్టర్లను ఆదేశించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూర్చే లే ఔట్ రెగ్యులరైజేషన్ (ఎల్‌ఆర్‌ఎస్) ప్రక్రియను వేగవంతం చేయాలని, ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నిబంధనల ప్రకారం భూముల క్రమబద్ధీకరణ జరగాలని, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, మధ్య దళారుల ప్రమేయం లేకుండా, సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై శనివారం జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి ఆ జిల్లా కలెక్టర్ ఆఫీసు నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆగస్టు 31వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ, 2020 వరకు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను ఆమోదించిందన్నారు.

ఈ కాలంలో 25.70 లక్షల దరఖాస్తులు వచ్చాయని, నాలుగు సంవత్సరాలుగా ఈ దరఖాస్తులు ఎలాంటి పరిష్కారానికి నోచుకోలేదని మంత్రి అన్నారు. మొత్తం 25.70 లక్షల దరఖాస్తుల్లో హెచ్‌ఎండిఏ పరిధిలో 3.58 లక్షలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1.06 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో పరిధిలో 13.69 లక్షలు, గ్రామ పంచాయతీల్లో 6 లక్షలు, అర్భన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో 1.35 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ దరఖాస్తుదారులు సమస్య పరిష్కారం కొరకు నాలుగు ఏళ్ల నుంచి ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. ఈ దరఖాస్తులను అత్యంత ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని కలెక్టర్లకు మంత్రి పొంగులేటి సూచించారు.

జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలి
దరఖాస్తుల పరిష్కారానికి జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని, సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ పై తీసుకోవాలని, ప్రతిపాదనలు పంపిస్తే రెవెన్యూ శాఖ నుంచి సిబ్బందిని సర్దుబాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలనకు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు.

క్రమబద్ధీకరణ దరఖాస్తులపై జారీచేసిన నోటీసులకు సంబంధించిన సమస్యలను నివృత్తి చేసేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్‌లు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ, మున్సిపాలిటీలు మినహా మిగిలిన ప్రాంతాల దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు.

జిల్లా కలెక్టర్‌లు నిరంతరం పర్యవేక్షించాలి
ఎల్‌అర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో భాగస్వాములయ్యే అన్ని స్థాయిల సిబ్బంది, అధికారులకు శిక్షణ తక్షణమే చేపట్టాలని, ఎల్‌ఆర్‌ఎస్ విధి,విధానాలను విడుదల చేసిన నేపథ్యంలో అమలుకు అవసరమైన కార్యాచరణను చేపట్టాలని, జిల్లా కలెక్టర్‌లు ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. హెచ్‌ఎండిఏ పరిధిలో ఉన్న ఏడు జిల్లాలల్లో అత్యంత విలువైన భూములు ఉన్నాయని ఈ జిల్లాల్లో లే ఔట్ల క్రమబద్దీకరణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధమైన స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తుందన్నారు. వారి ఆస్తులకు చట్టపరమైన గుర్తింపుతో సహా ఆమోదించబడిన లే ఔట్ల ద్వారా అభివృద్ధిని ప్రోత్సహిస్తుందన్నారు. ఆమోదించబడిన లే ఔట్ యజమానులకు ఇంటి నిర్మాణాలకు భవన నిర్మాణ అనుమతులు పొందేందుకు, బ్యాంకు రుణాలు పొందేందుకు, కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి సహాయపడుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News