Tuesday, October 22, 2024

బ్యాంకింగ్ నేపథ్యంలో కుటుంబ భావోద్వేగాలతో…

- Advertisement -
- Advertisement -

వైవిద్యభరితమైన సినిమాలు, పాత్రలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. మహానటి, సీతా రామం వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న దుల్కర్, తన తదుపరి చిత్రం లక్కీ భాస్కర్ కోసం బ్లాక్‌బస్టర్ దర్శకుడు వెంకీ అట్లూరి, ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేతులు కలిపారు. సాధారణ మనిషి యొక్క అసాధారణ ప్రయాణంగా లక్కీ భాస్కర్ చిత్రం రూపొందుతోంది. హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుక ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో కథానాయకుడు దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. “14 నెలల తర్వాత నా నుంచి వస్తున్న సినిమా లక్కీ భాస్కర్. ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఇది నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. హాస్యం ఉంటుంది, భావోద్వేగాలు ఉంటాయి, కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఉంటాయి, సంగీతం బాగుంటుంది”అని అన్నారు. కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ “లక్కీ భాస్కర్ అనేది నా మనసుకి బాగా దగ్గరైన చిత్రం. ఈ సినిమాలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది”అని పేర్కొన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “సినిమాలో ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది. బ్యాంకింగ్ నేపథ్యంలో కుటుంబ భావోద్వేగాలతో నడిచే ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది”అని తెలిపారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న లక్కీ భాస్కర్ చిత్రం తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఈనెల 31న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News