బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక ఇటీవల విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకొని, ఆ అంచనాలను రెట్టింపు చేసింది. ‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమనే అభిప్రాయం అందరిలో నెలకొంది. ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం మార్చి 29 శనివారం విడుదల కావాల్సి ఉండగా, డిస్ట్రిబ్యూటర్ల కోరిక మేరకు ఒక రోజు ముందుగా మార్చి 28 శుక్రవారం విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. తాజా నిర్ణయంతో ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం మొదటి వారాంతంలో భారీ వసూళ్ళను రాబడుతుందని అనడంలో సందేహం లేదు.
‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాని ఒకరోజు ముందుగా విడుదల చేస్తుండటంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందిస్తూ, ‘మా పంపిణీదారుల అభ్యర్థన, మద్దతుతో ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం ఒక రోజు ముందుగా మార్చి 28వ తేదీన వస్తుంది. చివరి నిమిషంలో విడుదల తేదీ మార్చాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదు. మార్చి 29న అమావాస్య కావడంతో, మా పంపిణీదారులు విడుదలను ముందుకు తీసుకెళ్లడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం పట్ల మేము కూడా సంతోషంగా ఉన్నాము. ‘మ్యాడ్ స్క్వేర్’తో పాటు మార్చి 28న విడుదల కానున్న ‘రాబిన్హుడ్’ చితం కూడా ఘన విజయం సాధించాలని మనస్ఫూరిగా కోరుకుంటున్నాను. ఈ వేసవికి నవ్వుల పండుగ రాబోతుంది’ అని అన్నారు.
శ్రీకర స్టూడియోస్తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మ్యాడ్ సినిమాలో తనదైన ప్రత్యేక శైలి హాస్య సన్నివేశాలు, ఆకర్షణీయమైన కథనంతో ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్, ఈ సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు. మొదటి భాగంలో తమ అల్లరితో నవ్వులు పూయించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరియు విష్ణు ఓఐ(లడ్డు).. ‘మ్యాడ్ స్క్వేర్’లో అంతకుమించిన అల్లరి చేయబోతున్నారు. రెబాజాన్ ప్రత్యేక గీతంలో సందడి చేయనున్నారు. కె.వి. అనుదీప్, ప్రియాంక జవాల్కర్ తదితరులు కీలక పాత్రలలో అలరించనున్నారు. ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.