హైదరాబాద్: టాలీవుడ్ హీరో మహేశ్బాబుకి కొద్ది రోజుల క్రితం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. సురానా గ్రూప్, సాయి సూర్య డెవెలపర్స్కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన మహేశ్ ఎంత పారితోషికం తీసుకున్నారు? దాని చెల్లింపులు ఎలా చేశారు? అనే విషయంలో ఇడి నోటీసులు ఇచ్చింది. ఈ సోమవారం విచారణకు రావాలని నోటీసులలో పేర్కొంది. అయితే మహేశ్బాబు షూటింగ్లో బిజీగా ఉన్న కారణంగా విచారణకు హాజరు కాలేనని.. మరో తేదీని కేటాయించాలని ఇడిని కోరారు.
కాగా, మహేశ్బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. భారీ యాక్షన్ అడ్వెంచస్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. ‘ఎస్ఎస్ఎంబి29’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కొద్ది రోజుల క్రితమే ఒడిశాలో ఈ సినిమా ఒక షెడ్యూల్ షూటింగ్ని పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇవ్వడంతో మహేశ్ తన కుటుంబంతో కలిసి విదేశాలకు హాలిడేకి వెళ్లి తిరిగి వచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా మరో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.