Tuesday, April 8, 2025

బండి సంజయ్ ఇంట్లో నెమళ్లున్నాయ్: మహేశ్ కుమార్ గౌడ్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాదు
హెచ్‌సియూలో జింకలున్నాయనడం నిజం కాదు
ఢిల్లీలో బండి సంజయ్ ఇంట్లో నెమళ్లున్నాయ్
మీనాక్షి నటరాజన్ మంత్రులతో సమీక్ష చేయలేదు
పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం కల్ల అని పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు 11 ఏళ్లలో ఏమి తెచ్చారో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు వైట్ పేపర్ రిలీజ్ చేయాలన్నారు. దీనిపై తాము చర్చకు సిద్ధమని ఆయన చెప్పారు. సచివాలయంలో కూర్చునే అధికారం అందరికీ ఉందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మీనాక్షి నటరాజన్ మంత్రులతో సమీక్ష చేసింది అనడం అవాస్తవమని ఆయన చెప్పారు. హెచ్‌సియూలో జింకలు ఉన్నాయన్నది వాస్తవం కాదన్నారు. నెమళ్లు ఎక్కడైనా ఉండొచ్చన్నారు. ఢిల్లీలో బండి సంజయ్ ఇంట్లో కూడా నెమళ్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

అమిత్ షాలు ఆర్డర్ వేస్తేనే కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు పని చేస్తారన్నారు. గత ప్రభుత్వం హయాంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 20 వేల ఎకరాల ప్రభుత్వ భూములు కరిగిపోతే కిషన్ రెడ్డికి ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు. 10 వేల ఎకరాల భూములను కెసిఆర్, కెటిఆర్‌లు అమ్ముకుంటే కిషన్‌రెడ్డి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కిషన్ రెడ్డి ఒక్క ఛాన్స్ కావాలని ప్రాధేయప డుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఏమి ఎలగబెట్టారని ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. మూడోసారి కూడా మతం పేరున ఓట్లు అడిగి అధికారంలోకి వచ్చారని ఆయన ఆరోపించారు.

కేంద్రమంత్రులు మెట్రో కోసం ఒక్క రూపాయి కూడా తెచ్చిన పాపాన పోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన జరిగి హైదరాబాద్ ప్రజలు సుఖపడితే కిషన్ రెడ్డికి నచ్చదని ఆయన అన్నారు. మతతత్వ రాజకీయాలను తెలంగాణ ప్రజలు కోరుకోరని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వస్తామని కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు పగటి కలలు కంటున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి గురి అయినా, ఎన్ని కష్టాలు వచ్చినా కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపించినా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. పేద వాళ్లకు సన్న బియ్యం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News