కొండపాక: కొండపాక మండలం దుద్దెడలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తొగుట సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం… దుద్దెడ గ్రామానికి చెందిన మేక శ్రీనివాస్(46) 12 ఏండ్ల క్రితం సిద్దిపేటకు వలస వచ్చి వివేకానంద కాలనీలో నివాసం ఉంటున్నాడు. సిద్దిపేటలోనే ఓ దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 4గంటలకు ఇంటినుంచి వెళ్లిన శ్రీనివాస్ రాత్రి అయినా తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేసిన స్పందన రాలేదు.
కాగా బుధవారం ఉదయం దుద్దెడ రాజీవ్ రహదారి నుంచి రాంపల్లి గ్రామానికి వెళ్లే దారిలో పక్కన పత్తి చేనులో స్థానికులు శ్రీనివాస్ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే సమాచారం అందుకున్న గజ్వెల్ ఏసిపి నారాయణ, సిఐ రవీందర్, కుకునూర్ పల్లి ఎస్ఐ సాయిరాం ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. తలపై బలమైన గాయాలు ఉండడంతో రాడ్తో కొట్టిచంపినట్టుగా ప్రాథమికంగా నిర్దారించారు. ఘటనాస్థలంలో పలు ఆధారాలను సేకరించారు. కాగా సిద్దిపేటకు చెందిన ముస్తాల శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్య చేసిన వారిని పట్టుకుని శిక్ష పడేలా చూస్తామని సిఐ తెలిపారు.
Man Brutally Murdered in Duddeda