హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు మంచు మోహన్బాబు కుటుంబంలో వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా మంచు మనోజ్ ఓ వీడియోను ట్వీట్ చేశారు. అది కన్నప్ప కాదు దొంగప్ప పురాణం అని, జూన్ 27న తెరపైకి వస్తుందని మనోజ్ చురకలంటించారు. ఇంతకీ కన్నప్ప సినిమా విడుదల జూలై 17 లేక జూన్ 27 అని వ్యంగంగా అడిగారు. ’80 శాతం విష్ణు (#విస్మిత్) కమీషన్ తో 100 కోట్ల రూపాయలతో నిర్మించిన భారీ బడ్జెట్ సినిమా కేకా’ అని ఎద్దేవా చేశారు.
మూడు రోజుల క్రితం జల్పల్లిలోని తన తండ్రి మోహన్బాబు ఇంటికి వెళ్లిన మంచు మనోజ్ ను భద్రతా సిబ్బంది లోనికి అనుమతించలేదు. దీంతో ఆయన ఇంటి బయటే కూర్చోని ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. తాను అంటే విష్ణుకు పడదని, కోర్టు ఆర్డర్ ఉన్నా తనని లోపలికి వెళ్లనివ్వడంలేదు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో మూడు పెట్స్ ఉన్నాయని, అవి ఇవ్వమని అడుగుతున్నానని, తప్పుడు సంతకాలతో కోర్టులను పక్కదారి పట్టిస్తున్నారని, తన కూతురు బర్త్ డే చేసుకోవడానికి ఏప్రిల్ 2న హైదరాబాద్ వచ్చామని, ఇక్కడ పరిస్థితులు బాగోలేకపోవడంతో జైపూర్ వెళ్లామని వివరించారు. పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు చార్జిషీట్ దాఖలు చేయట్లేదు అని మంచు మనోజ్ అడిగారు. గతంలో విష్ణు భవిష్యత్ కోసం ఆడవేషం కూడా వేశానని తెలియజేశారు.
గతంలో తమ విద్యాసంస్థలో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై తాను నిలదీయడంతో తన తండ్రి, తదితరులు తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మనోజ్ ఆరోపించిన విషయం తెలిసిందే. వాస్తవానికి తమ కుటుంబంలో ఆస్తి తగాదాలేమీ లేవని వెల్లడించారు. కేవలం తనపై అక్కసుతోనే ఆస్తి తగాదాగా చిత్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. తమ విద్యాసంస్థకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల యోగక్షేమాలే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు వివరించారు. తనకు న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని మనోజ్ గతంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.