Monday, April 7, 2025

ఢిల్లీలో మన్మోహన్ సింగ్ స్మారక కేంద్రానికి రంగంసిద్ధం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు స్మారక కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో స్మారకానికి ప్రతిపాదిత ప్రదేశానికి మన్మోహన్ సింగ్ కుటుంబం ఆమోదం తెలియజేసింది. ప్రతిపాదిత ప్రదేశాన్ని తాము ఆమోదించామని, అంగీకార పత్రాన్ని పంపుతున్నామని ఆయన కుటుంబం కేంద్ర గృహనిర్మాణ, పట్టణ అభివృద్ధి మంత్రిత్వశాఖకు లేఖ రాసినట్లు ఆయన కుటుంబ సన్నిహిత వర్గాలు తెలియజేశాయి. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి కూడా అయిన మన్మోహన్ సింగ్ ముగ్గురు కుమార్తెలు, వారి భర్తలు ప్రతిపాదిత స్మారక కేంద్ర ప్రదేశాన్ని ఇంతకుముందు సందర్శించారు. సుమారు 900 చదరపు మీటర్ల విస్తీర్ణం గల ఆ ప్రదేశం రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో ఉన్నది.

ఆ స్మృతి స్థల్‌లోనే మాజీ ప్రధానులు, రాష్ట్రపతుల స్మారక చిహ్నాలను ఏర్పాటు చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్మారక చిహ్నం మన్మోహన్ సింగ్ కోసం ప్రతిపాదించిన ప్రదేశం పక్కనే ఉన్నది. మన్మోహన్ సింగ్ స్మృత్యర్థం ఏర్పాటు చేయనున్న ఒక ట్రస్ట్ పేరిట భూమి బదలీ ప్రక్రియ నిర్వర్తించవలసి ఉంది. త్వరలో ఏర్పాటు కానున్న ఆ ట్రస్ట్ సభ్యుల పేర్లను ఆయన కుటుంబం ప్రతిపాదించి, ఖరారు చేయవలసి ఉందని ఆ వర్గాలు తెలియజేశాయి. ట్రస్ట్ ఏర్పాటు కాగానే ప్రభుత్వం స్మారక చిహ్నం నిర్మాణానికి రూ. 25 లక్షల గ్రాంట్‌ను బదలీ చేస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. కేంద్ర పబ్లిక్ వర్క్ శాఖ అధికారులు ఇప్పటికే ఆ ప్రదేశాన్ని సందర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News