Thursday, June 27, 2024

గుండెపోటు ఘటనలు.. కొవిడ్‌కు సంబంధంపై పరిశోధన : కేంద్ర ఆరోగ్యశాఖ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రోజురోజుకు రూపాంతరం చెందుతోన్న కరోనా వైరస్ ఇటీవల మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశంలో ఇప్పటివరకు 214 రకాల కొవిడ్ వేరియంట్లను గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ వేరియంట్లపై కొవిడ్ వ్యాక్సిన్లు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని ఆయన అన్నారు.

ప్రస్తుతం బీఎఫ్.7 ఉపరకమైన ఎక్స్‌బీబీ 1.16 వేరియంట్ వ్యాప్తిలో ఉందన్న ఆయన, వైరస్ విస్తృతి పెరిగినప్పటికీ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇటీవల కొవిడ్ విజృంభణ నేపథ్యంలో ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వూలో కేంద్ర ఆరోగ్యమంత్రి పలు అంశాలను ప్రస్తావించారు. ‘దేశంలో భారీ స్థాయిలో చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ‘కొవిన్’ నుంచి వచ్చిన సమాచారం ఎంతో ఉపయోగపడుతోంది. కొవిడ్ తర్వాత స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.

దీంతో తమ వద్ద ఉన్న డేటాపై భారత వైద్య పరిశోధన మండలి పరిశోధన ప్రారంభించింది. మూడు, నాలుగు నెలల కిందట దీనిపై పరిశోధన మొదలైంది. మరో ఒకటి, రెండు నెలల్లో దీని ఫలితాలు వస్తాయి. కొవిడ్‌కు గుండెపోటు ఘటనలకు మధ్య సంబంధాన్ని కనుక్కునేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుంది. ఇటీవల కొందరు గుండెపోటుతో ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోయిన ఘటనలను చూస్తున్నాం ’ అని కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు.

మరోవైపు కొత్త వేరియంట్ గుర్తించిన వెంటనే వాటిని ల్యాబ్‌లో ఐసొలేట్ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. అనంతరం వాటిపై వ్యాక్సిన్ల పనితీరు ఏ విధంగా ఉందన్న దానిపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు వ్యాప్తిలో ఉనన అన్ని వేరియంట్లపై వ్యాక్సిన్లు సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టు తేలిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News