Sunday, September 8, 2024

తెలంగాణను అప్పుల పాలు చేసిన ఘనత బిఆర్‌ఎస్‌దే: భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

తెలంగాణను అప్పుల పాలు చేసిన ఘనత బిఆర్‌ఎస్‌దేనని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారమని భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ అనంతరం భట్టి సమాధానమిస్తూ పదేళ్లు అధికారంలో ఉండి ఏమి చేయకుండా వెళ్లినవారు ఇప్పుడు మాపై మాటల దాడి చేస్తున్నారని పరోక్షంగా బీఆర్‌ఎస్‌ను విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చి 8 నెలలే అయ్యిందని అందులో 3 నెలలు ఎన్నికల కోడ్‌లోరనే గడిచిపోయిందన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నట్లుగా బడ్జెట్ ఊహాజనితంగా ఎక్కడుందని ప్రశ్నించారు.

వ్యవసాయం కోసం రూ.72 వేల కోట్లు కేటాయించడం తప్పా.? రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కోసం రూ.10 వేల కోట్లు కేటాయించడం తప్పా అని ప్రతిపక్షాలను ఉతికి ఆరేశారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని పక్కదారి పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ కోసం బడ్జెట్‌లో రూ. 17,056 కోట్లు కేటాయించామని తెలిపారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రణాళిక సిద్ధం చేశామని, 30 వేలకు పైగా ఉద్యోగాలిచ్చామని గుర్తు చేశారు. మరో 35 వేల ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయని, 4 నెలల్లోనే 65 వేలకు పైగా జాబ్లు ఇచ్చిన ఘనత మాదేనన్నారు. రుణమాఫీపై కొందరు ఎగతాళి చేశారని, కానీ ఎంత కష్టమైనా రుణమాఫీపై ముందుకెళ్తుతున్నామని స్పష్టం చేశారు.

ఏదో ఐదేళ్లు గడిపేయడానికి రాలేదు : తెలంగాణలో రాబోయే 20 ఏండ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రైతు కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయం ఈ ఏడాది నుండే ఇస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే స్పష్టమైన విద్యుత్ పాలసీ తీసురాబోతున్నామని, 2035 వరకు విద్యుత్ ప్రణాళికను సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఏదో ఐదేళ్లు గడిపేయడానికి మేం అధికారంలోకి రాలేదని, తమ ప్రభుత్వానికి స్పష్టమైన విజన్ ఉన్నదని చెప్పారు. దేశం గర్వించేలా తెలంగాణలో ఇంటిగ్రేటేడ్ స్కూళ్లను తీసుకువస్తామని, 20 నుండి 25 ఎకరాల ప్రాంగణంలో విశాలంగా ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మిస్తామని తెలిపారు.

ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ విద్యార్థుల తయారవ్వాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ నూతన విద్యా విధానం దేశానికి ఆదర్శం కాబోతుందన్నారు. మా గ్యారెంటీల సంగతి సరే. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ రాష్ట్రానికి ఏం చేసిందని ప్రశ్నించారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించామని, ఆరోగ్య శ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. గ్యారెంటీల అమలు కోసం ప్రతిక్షణం పరితపిస్తున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో ఒక్క రివ్యూ జరగలేదని, కానీ తమ పాలనలో వరుస సమీక్షలతో పాలన పరుగులు పెడుతోందని సంతోషం వ్యక్తం చేశారు. మార్చి 1 నుంచే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ స్కీమ్ అమలు చేస్తున్నామని, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News