Saturday, February 22, 2025

అభివృద్ధిని చూసి తట్టుకోలేక పోతున్నారు: జగదీష్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రగతి నిరోధకులు తట్టుకోలేక పోతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాకపోవడం అందులో భాగమేనని ఆయన ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధి నిరోధకులు రానంత మాత్రాన ఒరిగే నష్టం ఏమి లేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రారంభోత్సవానకి రావడం, రాకపోవడం అనేది ఆమె విజ్ఞతకే వదలి పెడుతున్నామన్నారు. సచివాలయానికి గైర్హాజరుతో గవర్నర్ నిజ స్వరూపం బట్టబయలు అయిందని ఆయన విమర్శించారు.

నూతన సచివాలయం తెలంగాణా ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అని ఆయన అభివర్ణించారు. అటువంటి భవనాన్ని నిర్మించిన ముఖ్యమంత్రి కెసిఆర్ పేరు చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. మంచిని మంచిగా చూసే గుణం ప్రతిపక్షాలకు ఉండకపోవడం దురదృష్టకరమన్నారు. జరుగుతున్న అభివృద్ధితో ప్రతిపక్షాల అడ్రస్ శాశ్వతంగా గల్లంతు అవుతుందన్న బెంగ విపక్షాలను వెంటాడుతుందన్నారు. అందుకే అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆయన అన్నారు. ఇటువంటి వారికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News