అధికారంలోకి వస్తామని కెసిఆర్ పగటికలలు కంటున్నారని రెవెన్యూ ,హౌసింగ్ ,సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ ప్రకనటలో ఆరోపించారు. కెసిఆర్ ఒక సీజనల్ పొలిటీషియన్ అని, 14 నెలల నుంచి అజ్ఞాతంలో ఉన్న వ్యక్తికి అభివృద్ధి ఎలా కనబడుతుందని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్నట్లు ఫాంహౌస్ దాటని దొరవారు అధికారంపై పగటికలలు కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అధికారం కోల్పోగానే తనకు పదేళ్లు అధికారం కట్టబెట్టిన ప్రజలను మరిచి అజ్ఞాతంలోకి వెళ్లిన కెసిఆర్కు, ఎన్నికలప్పుడు మాత్రమే ఆయనకు ప్రజలు గుర్తుకొస్తారన్నారు. 14 నెలల నుంచి ఫాంహౌస్ దాటని ఆయన స్థానిక ఎన్నికలు వస్తున్నాయని ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ప్రజలు
మేడిగడ్డ కుంగినప్పుడు, రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ఆయనకు ప్రజలు గుర్తుకురాలేదన్నారు. శాసనసభలో కీలకమైన తీర్మానాలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ, భూభారతి బిల్లు, తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించిన మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానానికి కూడా కెసిఆర్ హాజరుకాలేదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సైతం ఆయన గైర్హాజరయ్యారన్నారు. తెలంగాణ ప్రజలు కష్టపడి కెసిఆర్ను ప్రతిపక్షంలో కూర్చోబెడితే, ఆయన ఏనాడు ప్రజాతీర్పును గౌరవించలేదన్నారు. అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడలేదని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షనేత అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలను ప్రస్తావించాలని, కానీ, కెసిఆర్ తాను ప్రజలు జవాబుదారీగా లేనట్లుగా ప్రవర్తిస్తున్నారన్నారు. ఆయన అసెంబ్లీకి వస్తే ఆయన పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఏవిధంగా తిరోగమన దిశలోకి తీసుకెళ్లారు, పదేళ్లలో ఆయన చేసిన నిర్వాకాలను తప్పులను ఒక్కోక్కటిగా సరిచేసుకుంటూ 14నెలల్లో తాము సాధించిన అభివృద్ధిని సవివరంగా కెసిఆర్ ముందు ఉంచుతామన్నారు.
పదేళ్లలో కెసిఆర్ చేసిన అప్పులకు
కాంగ్రెస్ భవిష్యత్ గురించి కాకుండా ముందుగా కెసిఆర్ తన భవిష్యత్, తన పార్టీ భవిష్యత్ గురించి ఆలోచిస్తే బాగుంటుందని మంత్రి పొంగులేటి సూచించారు. కెసిఆర్ భవిష్యత్పై గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. పార్లమెంట్ తీర్పే భవిష్యత్లో ఉంటుందన్నారు. విపరీతమైన అప్పులు చేసి నెత్తినమీద మిత్తీల భారం పెట్టిపోయారని ఆయన ఆరోపించారు. పదేళ్లలో కెసిఆర్ చేసిన అప్పులకు తెలంగాణ సమాజం ఆయన్న ఎప్పటికీ క్షమించదన్నారు. నువ్వు వద్దు, నీ పాలన వద్దు మహాప్రభో అని ప్రజలు వదిలించుకున్నా ఇంకా వదిలేది లేదన్నట్లుగా కెసిఆర్ వ్యవహారం ఉందని ఆయన తెలిపారు.