Saturday, April 19, 2025

రైతుకు భూమికి ఉన్న బంధమే భూ భారతి:మంత్రి పొంగులేటి

- Advertisement -
- Advertisement -

దేశంలో భూ భారతి చట్టం రోల్డ్ మోడల్‌గా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్ , పౌర సమాచార సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రతి రైతుకు భరోసా, భద్రత కల్పించాలని ఎన్నో రాత్రులు నిద్రపోకుండా మేధావులతో కలిసి భూ భారతి చట్టాన్ని రూపొందించడం జరిగిందని ఆయన తెలిపారు. భూ భారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలం ఖాజీపూర్ గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆనాడు ఇందిరమ్మ హయాంలో పేదలకు ఇచ్చిన వ్యవసాయ భూములను పింక్ కలర్ కు చెందిన కొందరు లక్షలాది ఎకరాలను కొల్లగొట్టారు. ఆ భూములను ఆడిట్ రూపంలో బయటకు తీసి మళ్లీ పేదలకు పంచాలన్నదే మా ప్రభుత్వ లక్షమన్నారు. ధరణి పేరుతో గతంలో అసైన్డ్ భూములను కబ్జా చేశారు. ఆ భూములను తిరిగి పేదవాడికి చెందే విధంగా చూస్తామన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టానికి, భూ భారతి చట్టానికి ఎంతో తేడా ఉందని, భూ భారతి చట్టంరైతు భూ సమస్యకు పరిష్కారం చూపుతుందన్నారు.

తమ భూములు ధరణి వల్ల ఇంకా తమ పేరిట నమోదు కాలేదని ప్రతిపక్ష శాసన సభ్యులే అసెంబ్లీలో తనను అడిగారని, కానీ ప్రతి పక్ష నేత శాసన సభలో భూ భారతి చట్టానికి ఆమోదం తెలపకుండా అడ్డుపడ్డారని విమర్శించారు. ధరణి చట్టం వల్ల ప్రజలు అధికారుల వద్దకు వెళ్లాల్సి ఉండేదని, భూ భారతి చట్టం వల్ల ప్రజల వద్దకే అధికారులు వారి వారి గ్రామాలకు వచ్చి ఒక్క రూపాయి తీసుకోకుండా భూ సమస్యలను పరిష్కరిస్తారని మంత్రి తెలిపారు. మొదటి విడత 6వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చి మ్యాప్ పై సర్వేయర్ సంతకంతో కంప్యూటర్ లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ద్ధితో , మన సాక్షిగా పేదవారికి మేలు చేయాలని అద్బుతమైన ఈ చట్టాన్ని చేసుకున్నామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే కలెక్టర్లను పిలిచి భూ భారతి చట్టం ద్వారా రైతుల భూ సమస్యలను పరిష్కరించాలని స్పష్టంగా చెప్పారన్నారు. మొదటగా 4 మండలాలను పైలెట్ గా తీసుకున్నామని, మే 1 నుంచి రాష్ట్రంలోని అన్ని మండలాలకు జిల్లా కలెక్టర్లు వెళ్లి ఈ చట్టంగురించి ప్రజలు, రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. అయితే జూన్ 2 లోపు ఎంపిక చేసిన మొదటి నాలుగు పైలెట్ గ్రామాల సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు.

తమ భూ సమస్యల గురించి తనతో చెప్పిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, చెప్పని వారు కూడా కొత్త చట్టం వినియోగించుకొని సమస్యలు పరిష్కరించుకోవచ్చని సలహ ఇచ్చారు. ధరణితో ప్రజలకు ఎంతో ఘోష పెట్టారో భూ భారతి అమలులోకి వచ్చిన తర్వాత తెలుస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం భూ పరిపాలనలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతూ ధరణి స్థానంలో సరళమైన భూ భారతి పోర్టల్ ను ఈ నెల 14న ప్రారంభించిందని, నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలాన్ని పైలెట్ మండలం గా ఎంపిక చేసిందని తెలిపారు. భూ పరిపాలనలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పోర్టల్ ను జిల్లా అధికార యంత్రాంగం, ఉద్యోగుల సహకారంతో విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు డా. వాకిటి శ్రీహరి, డా. చిట్టెం పర్నికారెడ్డి, బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయ్ కుమార్ , కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ఎనుముల తిరుపతిరెడ్డి,

భూ భారతి ప్రత్యేక అధికారి యాదగిరి, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ శాఖ , జ్యోతి బుద్ద ప్రకాశ్ , ఐఏఎస్ , ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ శాఖ, సీసీఎల్‌ఏ సెక్రటరీ మంద మకరంద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ , జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ , జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలోం, కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి,న్యాయవాది భూమి సునీల్ , ఆర్డీఓ రామచందర్ నాయక్ , డిసిసి అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి, మద్దూరు సింగిల్ విండో చైర్మన్ నర్సిములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News