హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. హెచ్సియూకి పక్కనే ఆనుకుని ఉన్న ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రైవేట్ సంస్థలకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయ పోరాటం చేసి తిరిగి తెలంగాణ ప్రభుత్వం దక్కించుకుందని తెలిపారు. భూముల వేలం, అక్కడ చేపట్టబోయే అభివృద్ధి పనులతో యూనివర్సిటీకి ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. అభివృద్ధికి పనులకు ఇచ్చిన భూమిలో చెరువు లేదని స్పష్టం చేశారు. అవసరం అయితే మరోసారి హెచ్సియూ భూములపై ప్రభుత్వం పున: పరిశీలన చేస్తుందని హామీ ఇచ్చారు.
యూనివర్సిటీ భూములను కాపాడడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో భూములు చదును చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆదివారం రాత్రి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అయితే అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తుగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాలను బుల్డోజర్లతో చదును చేసేందుకు ప్రయత్నించడంతో విద్యార్థి సంఘాలు అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. వెంటనే పనులను ఆపాలని అక్కడే బైఠాయించి నిరసన తెలుపగా వారికి పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.