ఆదివాసీల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆపరేషన్ ‘కగార్’ను తక్షణమే నిలిపివేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ఛత్తీస్ఘడ్ సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. భారత్ బచావో సంస్థ ప్రతినిధులు గాదె ఇన్నయ్య, డాక్టర్ ఎమ్ ఎఫ్ గోపీనాథ్, జంజర్ల రమేష్ బాబు మంగళవారం ప్రజాభవన్లో మంత్రి సీతక్కతో భేటీ అయ్యారు. ఆపరేషన్ కగార్ ను నిలిపివేసేలా తన వంతు ప్రయత్నం చేయాలని వారు మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఛత్తీస్ఘడ్ సరిహద్దు కర్రెగుటల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని నిలువరించేలా చొరవ చూపాలని కోరారు. వేల సంఖ్యలో కేంద్ర బలగాలు కర్రెగుట్ట ప్రాంతాల్లో సంచరిస్తున్నటంతో ఆదివాసీలు భయాందోళనకు గురవుతున్నారని మంత్రికి తెలిపారు.
ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క మాట్లాడుతూ మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించాలని కోరారు. రెండు వైపుల ప్రాణ నష్ట నివారణకు శాంతి చర్చలు మార్గం చూపుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మధ్యభారతంలోని ఆదివాసి ప్రాంతాలు రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 పరిధిలోకి వస్తాయని, అక్కడ ఆదివాసీలకు ప్రత్యేక హక్కులు, ప్రత్యేక పరిపాలన విధానాలు ఉంటాయని గుర్తు చేశారు. అందుకే ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి వారి శాంతియుత జీవన విధానానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలి తప్ప బల ప్రయోగంతో కాకుండా, చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలనీ ఆదివాసి బిడ్డగా కోరుకుంటున్నానని తెలిపారు. ఆపరేషన్ కగార్ తో ఆదివాసీలు తీవ్రభయాందోళనతో ఉన్నారని, వారికి తాను అండగా ఉంటానని తెలిపారు.