Tuesday, September 17, 2024

కేంద్ర మంత్రుల ఏరియల్ సర్వే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను చూసి చలించిపోయానని, రైతులకు సాయం చేయడం అంటే దేవుళ్ళకు పూజ చేసినట్లేనని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఖమ్మం జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను శుక్రవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతో కలిసి ఆయన ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిం చారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతోపాటు సమీపంలోని సూర్యాపేట, మహబూబాబాద్, ములుగు జిల్లాలో వరద వల్ల దెబ్బతిన్న పాంత్రాలను కూడా ఆయన ఏరియల్ సర్వే చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం మల్లు భట్టి ఖమ్మం జిల్లా, మధిర నియోజకవర్గం, ఎర్రుపాలేం మండల కట్టలేరు వరద నీటితో ముంపునకు గురైన పంట పొలాలను ఆ తరువాత ఖమ్మం పట్టణంలో మున్నేరు వాగు ఉప్పొంగడంతో ముంపు ప్రాంతానికి గురైన ప్రకాష్ నగర్ కాలనీని ఏరియల్ సర్వే ద్వారా కేంద్ర మంత్రులకు చూపించారు. మున్నేరు వరదల వల్ల పేద మధ్యతరగతి ప్రజలు నష్టపోయిన వివరాలను ఆయన కేంద్ర మంత్రికి వివరించారు.

ఆ తరువాత ఖమ్మం, సూర్యాపేట జాతీయ రహదారిపై టోల్ ప్లాజా పక్కన ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వాగతం పలికారు. సింగినేనిపల్లి హెలి ప్యాడ్ నుంచి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జూజులరావుపేట గ్రామానికి వారు రోడ్డు మార్గంలో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం, -సూర్యాపేట జాతీయ రహదారిని నాయకన్ గూడెం వద్ద ఇటివల భారీ వర్షాల వల్ల పాలేరు మెయిన్ కెనాల్ కు గండిపడిన ప్రాంతాన్ని, దెబ్బతిన్న పంటలను కేంద్ర బృందం పరిశీలించింది. ఆ తరువాత కూసుమంచి మండలం, పాలేరులోని నవోదయ పాఠశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పొలాల ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర మంత్రుల బృందం పరిశీలించింది. అనంతరం ప్రకృతి విపత్తు వల్ల జరిగిన నష్టంపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ నేరుగా రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వరదల కారణంగా పంటలు బాగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టాన్ని తెలుసుకునేందుకు ప్రధాన మంత్రి తనను ఇక్కడికి పంపించారని, తాను రాజకీయాలు చేయడానికి మాత్రం రాలేదన్నారు. తాను కూడా ఒక రైతునేనని, రైతు బాధలు ఏంటో తనకు తెలుసన్నారు. పంట నష్టంతో రైతులంతా దు:ఖించడం తాను చూశానని, నిరాశకు గురికాకుండా ధైర్యంగా ఉండాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తాయని భరోసా ఇచ్చారు. కేంద్రం ఇచ్చిన విపత్తు నిధులను తెలంగాణలో గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు.. ఫసల్ బీమా యోజన సహా కేంద్ర ప్రభుత్వ పథకాలను సైతం రాష్ట్రంలో అమలు చేయలేదన్నారు. గతంలో కేంద్రం ఇచ్చిన నిధులనుఉపయోగించుకుంటే మళ్లీ నిధులు వచ్చే అవకాశం ఉండేదని, కానీ గత ప్రభుత్వం వినియోగించుకోకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. కానీ గత ప్రభుత్వం ఆ బీమా పథకాన్ని ఉపయోగించుకోలేక పోయిందన్నారు. రైతుల కోసం ఫసల్ బీమా పథకాన్ని అమలు చేస్తామంటే కేంద్రాన్ని చేయనివ్వలేదు.. వారు కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. జరిగిన పంటల నష్టంపై హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష చేసి ఒక అంచనాకు వస్తామని తెలిపారు. పంట నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇచ్చిన తరువాత రైతులందరికీ న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News