Saturday, June 29, 2024

భవిష్యత్ కార్యాచరణపై కసరత్తు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటాన్ని ఆ పార్టీ సీరియస్‌గా పరిగణిస్తోంది. గులాబీ పార్టీ ఎంఎల్‌ఎల వలసల నేపథ్యంలో పార్టీలో నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించేందుకు అధినేత కెసిఆర్ స్వ యంగా రంగంలోకి దిగారు. పార్టీని పూర్తి స్థాయి లో పునర్నిర్మించే భవిష్యత్తు కార్యాచరణకు కెసిఆ ర్ త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గులాబీ బాస్ వరుసగా పార్టీ ఎంఎల్‌ల తో సమావేశమవుతున్నారు.తాజా పరిణామాల నే పథ్యంలో పలువురు పార్టీ ఎంఎల్‌ఎలు, ఇరత ప్ర జా ప్రతినిధులు, ముఖ్య నేతలతో అధినేత కెసిఆర్ విడివిడిగా కలిసి తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. మంగళవారం పలువురు ఎంఎల్‌ఎలతో సమావేశమైన కెసిఆర్ బుధవారం ఎర్రవెళ్లిలోని ఫాం హౌజ్‌లో ఎంఎల్‌ఎలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, బండారు లకా్ష్మరెడ్డితో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా వారితో పలువురు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు పార్టీ మారడం, పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలపై చర్చించారు. పార్టీలో ఒడిదొడుకులు సహజమేనని, ప్రజలు అన్నింటిని అర్థం చేసుకుంటారని తనని కలుస్తున్న ప్రజాప్రతినిధులు, నేతలతో కెసిఆర్ వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిసింది. ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని వారికి సూచిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొనసాగుతున్న వలసలు బిఆర్‌ఎస్ పార్టీకి సంబంధించి అధినేత కెసిఆర్ విస్తృత చర్చిస్తున్నట్లు తెలిసింది. ఎవరూ ఊహించని విధంగా కొందరు ఎంఎల్‌ఎలు పార్టీని వీడడం పట్ల న్యాయపోరాటానికి సిద్ధమవుతూనే పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.

త్వరలో పార్టీలతో కెసిఆర్ సమావేశం..?
లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి, నేతల వలసలు, క్షేత్రస్థాయిలో పరిస్థితుల గురించి కెసిఆర్ చర్చిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ పనితీరు, హామీల అమలు సహా ఇతర అంశాలపై కెసిఆర్ ఆరా తీస్తున్నారు. తాము బిఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని, కెసిఆర్ వెన్నంటే ఉంటామని వారు చెబుతున్నట్లు సమాచారం. పార్టీ తరపున గెలిచిన ఒకరిద్దరు ఎంఎల్‌ఎలు ఇటీవల కాంగ్రెస్‌లో చేరడం తమకు బాధ కలిగించిందని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే రాజకీయ పార్టీలలో వలసల గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని, ఒడిదొడుకులు బిఆర్‌ఎస్‌కు కొత్త కాదని కెసిఆర్ వారితో అంటున్నట్లు సమాచారం. కొంచెం ఓపిక పడితే మళ్లీ ప్రజల్లో ఆదరణ లభిస్తుందని, ఇప్పటికే బిఆర్‌ఎస్ ప్రభుత్వం లేకపోవడం వల్ల విద్యుత్, తాగు నీటి సరఫరా వంటి అనేక అంశాల్లో నష్టం జరుగుతున్నదన్న అంశాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని నేతలకు అధినేత చెబుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తుండటంతో ప్రజాక్షేత్రంలో ఉండాలని నేతలకు దిశానిర్ధేశం చేస్తున్నట్లు తెలిసింది.

అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ వాటి పరిష్కారం కోసం కృషిని కొనసాగించాలని కెసిఆర్ వారికి సూచిస్తున్నట్లు సమాచారం. కొంత సందిగ్ధంలో ఉన్న, పార్టీ మారతారని ప్రచారంలో ఉన్న ప్రజాప్రతినిధులు, నేతలకు అన్ని అంశాలు విడమర్చి చెబుతూ పార్టీలోనే కొనసాగాలని బుజ్జగిస్తున్నట్లు తెలిసింది. భవిష్యత్తులో తప్పకుండా మంచి అవకాశాలు కల్పిస్తామని వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మారిన పరిస్థితుల్లో పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు బిఆర్‌ఎస్ త్వరలోనే ఓ సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. సమావేశం ద్వారా నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రజలకు స్పష్టమైన సందేశం పంపాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. జిల్లా పరిషత్ పాలక మండళ్ల పదవీకాలం త్వరలో ముగియనున్న తరుణంలో జెడ్‌పి ఛైర్‌పర్సన్లతో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం ప్రజాపోరాటాలకు కార్యాచరణను రూపొందిచుకుని ఉద్యమబాట పట్టనున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News