Thursday, September 19, 2024

చీరెలు, గాజులు.. బూట్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సొంతపార్టీ ఎమ్మెల్యేలపైన నిప్పులు చెరిగి వారిపైన తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు వారికి చీర, గాజులు పంపించారు. బుధవారం బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చీర, గాజులు కొనుక్కొని, వాటిని వేసుకుని నియోజకవర్గాలలో పర్యటించాలంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దానం బిచ్చగాడు.. కడియం మోసగాడు
పూటకో పార్టీ మార్చే దానం నాగేందర్ బిచ్చగాడు.. చీటర్ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలంటూ కేపీ వివేకానందతో కలిసి ఆయన అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులను కలిశారు. అనంతరం మాట్లాడుతూ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఉపఎన్నికలు వస్తాయని భయపడిపోతున్నారన్నారు. తీర్పు ను అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల సమయం ఇచ్చిందని గుర్తు చేశారు. చర్యలు తీసుకోకుంటే సుమోటోగా కేసు స్వీకరిస్తామని హైకోర్టు చెప్పిన విషయాన్ని నరసింహాచార్యులకు వివరించారు. ఆలస్యం చేయకుండా తక్షణమే వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.

కౌశిక్‌రెడ్డికి శోభారాణి హెచ్చరిక
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి వివాదాస్పదంగా మారారు. బీఆర్‌ఎస్ ను వీడిన ఎమ్మెల్యేలకు చీర, గాజులు పంపుతున్నానని వాటిని వేసుకోవాలని ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బుధవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన మహిళా కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్ నేతలను హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు మహిళలను కించపరచడం మానుకోవాలని, మరోసారి ఆడవారిని కించరుస్తూ మాట్లాడేతే చెప్పుదెబ్బలు తప్పవని మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ శోభారాణి హెచ్చరించారు.

ఈ సందర్భంగా లైవ్ లో చెప్పును చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాల్లో మహిళలను అవమానించేలా మాట్లాడటం మంచి పద్ధతి కాదని, రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగాన పోరాడింది మహిళలేనన్నారు. మరోసారి చీరలు గాజులు చూపిస్తే కౌశిక్ రెడ్డి చెప్పు దెబ్బలు తినాల్సి వస్తుందని హెచ్చరించారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని అలాగే, పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని ఆయనను విచారణకు పిలవాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి దరిద్రపు గొట్టు చరిత్ర అందరికి తెలుసని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత అన్నారు. పాడి కాశిక్ రెడ్డికి పాడే ఎక్కే సమయం వచ్చిందని దుయ్యబట్టారు.

సుమోటోగా తీసుకోవాలి: భవానీ రెడ్డి
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని, బయటకు వచ్చి మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అధికార ప్రతినిధి భవానీ రెడ్డి డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి మాటలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News