వరంగల్ వచ్చే ధైర్యం లేక కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పారిపోయారని బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత విమర్శించారు. హామీలపై ప్రజలు నిలదీస్తారనే రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారని ఆరోపించారు. అదే వరంగల్లో రాహుల్ గాంధీ చేసిన రైతు డిక్లరేషన్ అమలే కాలేదని, కాబట్టి వరంగల్ డిక్లరేషన్పై రైతులు ప్రశ్నిస్తారని రాహుల్ గాంధీ భయపడ్డారని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట తప్పితే ప్రజలు ఊరుకోబోరని హెచ్చరించారు. మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న నగరంలో తలపెట్టనున్న మహిళా శంఖారావం సభ పోస్టర్ను ఎంఎల్సి కవిత బుధవారం నాడు తన నివాసంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎంఎల్సి కవిత మాట్లాడుతూ… మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఎక్కడా తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఇక్కడి కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మడం లేదని ఎన్నికలప్పుడు ఢిల్లీ నుంచి నాయకులను తీసుకొచ్చారని, సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి చిలుక పలుకులు పలికారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ముఖం కాదు… సోనియా, ప్రియాంకా, రాహుల్ గాంధీల ముఖం చూసి మహిళలు కొంత వరకు ఓట్లు వేశారని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హామీల అమలును విస్మరించిందని తెలిపారు.
ఇచ్చిన హామీలను అమలు చేయాలి
అధికారంలోకి వచ్చి 14 నెలలు అయినా మహిళలకు 2500 ఇవ్వడం లేదని, దాంతో రేవంత్ రెడ్డి మహిళలకు రూ 35 వేల చొప్పున బాకీ పడ్డారని ఎంఎల్సి తెలిపారు. రూ. 35 వేలను ప్రతీ మహిళా బ్యాంకు ఖాతాలో జమా చేయాలని డిమాండ్ చేశారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామని రేవంత్ రెడ్డి మోసం చేశారని ధ్వజమెత్తారు. కెసిఆర్పై అక్కసుతో కెసిఆర్ కిట్ల పంపిణీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వ ఆస్పత్రులపై శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చి బస్సుల సంఖ్యను తగ్గించారని పేర్కొన్నారు. బిడి కార్మికులకు పెన్షన్ను 4 వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, తక్షణమే దాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి
రాష్ట్రంలో మహిళలకు భద్రత లేని పరిస్థితి ఏర్పడిందని ఎంఎల్సి కవిత ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో క్రైమ్ రేటు 20 శాతం పెరిగిందని, ఆడపిల్ల కాలేజీకి వెళ్తే ఇంటికొచ్చే వరకు ఎదురుచూసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. శివారు ప్రాంతాల్లోని ఇళ్లలో దొంగలు చెలరేగుతున్నారని చెప్పారు. కెసిఆర్ పదేళ్ల పాలనలో ఒక్క మతకల్లోలం జరగలేదని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాకా ఎక్కడో ఒక చోట తరుచూ మతకల్లోలాలు జరుగుతున్నాయని ఎత్తిచూపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో 70 శాతం పనిచేయడం లేదని పేర్కొన్నారు. భద్రత కోసం కూడా మహిళలు పోరాటం చేయాల్సిరావడం బాధాకరం అని ఎంఎల్సి కవిత పేర్కొన్నారు.