Saturday, March 29, 2025

రైతుల గోడు పట్టదా?:ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వం సాగునీళ్లు ఇవ్వక రాష్ట్రంలో పంటలు ఎండుతున్నాయని, అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల గోడు పట్టడం లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు ఎండి రైతులు ఆందోళన చెందుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇంకా మాటలు చెబుతూ మభ్యపెడుతుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి రైతుల ఉసురు తగులుతుందని శపించారు. మంగళవారం పెద్దగట్టు లింగమంతుల స్వామివారి జాతరలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని చౌడమ్మ తల్లికి బోనం సమర్పించారు. లింగమంతుల స్వామిని దర్శించుకున్న అనంతరం సూర్యాపేట జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 199 టిఎంసిలతో బనకచర్లతో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందని, అనుమతులతో ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ మన ముఖ్యమంత్రి కనీసం నాగార్జున సాగర్‌ను కూడా మన ఆధీనంలోకి తీసుకురాలేకపోయారని విమర్శించారు.

కాళేశ్వరం ద్వారా సూర్యాపేట జిల్లాలో కేసీఆర్ గోదావరి జలాలను పారించారని, కృష్ణా పరివాహన ప్రాంతంలోనూ గోదావరి నుంచి నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో కోదాడ నియోజకవర్గానికి కాళేశ్వరం ద్వారా లక్షా 22వేల ఎకరాలకు నీళ్లు అందించారని వివరించారు. ఇప్పుడు నీళ్లు ఎందుకు తేవడం లేదని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. నీళ్లు ఎందుకు తేవడం లేదో చెప్పాని మంత్రి ఉత్తమ్‌కుఉ సవాలు విసిరారు. రాజకీయ కక్షతోనే మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదని ఇంజనీర్లు చెబుతున్నారని చెప్పారు. మరో 40 రోజుల పాటు నీళ్లు ఇస్తేనే పంటలు చేతికొచ్చే అవకాశం ఉంటుందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నీళ్లు ఇవ్వడం లేదని ఎండగట్టారు. గత ఏడాది నీళ్లు ఇవ్వక సూర్యాపేట, మమబూబాబాద్ జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని, నీళ్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్లనే అప్పుడు పంటలు ఎండిపోయాయని తెలిపారు.

కేసీఆర్ ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల ప్రేమతో పరిపాలించారని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఏ ఒక్క అంశం పై ఆలోచన చేయకుండా పాలిస్తున్నారని చెప్పారు. 14 నెలల్లో 30 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారని, ఎవరు ఏమనుకున్నా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దల కాళ్లు పట్టుకుంటా అన్నట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారని అన్నారు. కేసీఆర్ హయాంలో మహిళల పై నేరాలు చేయాలంటే వెన్నులో వణుకుపుట్టేదని, కానీ ఇప్పుడు రాష్ట్రంలో మహిళలకు భద్రత లేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో మత కల్లోలం లేని ప్రాంతమే లేదని, కాంగ్రెస్ పార్టీ పాలనలో శాంతి భద్రతల సన్నగిల్లాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు ఏ వర్గానికి కాంగ్రెస్ చేసిందేమి లేదని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ కోసం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎస్సీ, బీసీల జనాభాను తక్కువ చేసి చూపిస్తున్నదని ఎత్తిచూపారు.

గందరగోళం కాకిలెక్కలతో సీఎం రేవంత్ రెడ్డి కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీ గల్లా పట్టుకుని అడిగితే రైతు రుణమాఫీని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ ఎవరికీ సంపూర్ణంగా రుణ మాఫీ కాలేదని చెప్పారు. రైతు భరోసా ఒక్కో గ్రామంలో సగం మంది రైతులకు కూడా రాలేదని అన్నారు. రైతులను కూడా మోసం చేస్తూ రేవంత్ రెడ్డి పైశాచికానందం పొందుతున్నారని విరుచుకుపడ్డారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, భారాస మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్‌కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్ కుమార్, సూర్యాపేట మాజీ జడ్పి ఛైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు, మాజీ జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News