గ్రూప్ 1 పరీక్షలు, ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలను ప్రభుత్వంతో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివృత్తి చేయాలని బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల్లో జరిగిన అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో 11 విశ్వవిద్యాలయాల విద్యార్థుల ప్రతినిధులు ఆదివారం నాడు ఎంఎల్సి కవితను కలిసి చర్చించారు. శాసనమండలిలో ఈ అంశాన్ని లేవనిత్తాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్సి కవిత మాట్లాడుతూ…. పేపర్ల మూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని విద్యార్థులు తన దృష్టికి తీసుకు వచ్చారని తెలిపారు. ట్రాన్స్లేషన్ సమస్య వల్ల ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు సరిగ్గా మూల్యాంకనం చేయలేకపోయారని,
తద్వారా మార్కుల్లో వ్యత్యాసాలు ఏర్పడ్డాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. గ్రూప్ 1 పరీక్షల్లో ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ నెంబరు, మెయిన్స్కి మరొక హాల్ టికెట్ నెంబరు కేటాయించడం వల్ల విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ప్రస్తావించారు. టిజిపిఎస్సి విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో దాదాపు 13 వేల మంది అభ్యర్థుల ఫలితాలు వెల్లడించలేదని, ఏ కారణం చేత ఆ 13వేల మందిని ఇన్వాలిడ్గా ప్రకటించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు సత్య, గౌతమ్, విద్యార్థి సంఘాల జెఎసి నాయకులు ఎల్చాల దత్తాత్రేయ, గ్రూప్ 1 అభ్యర్థులు సింధు రెడ్డి, అనూష, సత్యవతి, రవీందర్ రాథోడ్, క్రాంతి కిరణ్ మరియు తదితరులు పాల్గొన్నారు.