బత్తుల సిద్దేశ్వర్కు ప్రాణ హాని జరిగితే కేంద్రమే బాధ్యత వహించాలి
బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ / హైదరాబాద్ : బిసిలకు విద్యా, ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చి బిసి రిజర్వేషన్ల కు రాజ్యాంగ భద్రత కల్పించాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇదే ప్రధాన డిమాండ్ తో బిసి హిందూ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర్ గత 20 రోజులుగా ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆయనతో చర్చించి దీక్షను విరమింప చేయాలని జాజుల కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును, రాష్ట్ర గవర్నర్ కూడా ఆమోదించి రాష్ట్రపతికి పంపించి వారం రోజులు గడుస్తోందని ఈ బిల్లుపై ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని ఆయనన్నారు.
రాష్ట్ర అసెంబ్లీలో చేసిన బిల్లుకు రాష్ట్ర బిజెపి మద్దతు తెలిపిందని, కాని కేంద్ర బిజెపి మాత్రం రాష్ట్ర బిజెపి నిర్ణయానికి విరుద్ధంగా బిసి బిల్లును ఆమోదించకపోవడంలో అంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బిజెపి పార్టీ ఒకే పార్టీ ఒకే విధానం ఉన్నట్లయితే ఇప్పటికైనా స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. బిసి ఉద్యమకారుడు, బిసిల డిమాండ్ల సాధన కోసం గత 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా కనీసం నిరాహార దీక్ష చేస్తున్న నాయకులతో చర్చించకపోవడం అత్యంత బాధాకరమన్నారు . ఇప్పటికే నిరాహార దీక్ష చేస్తున్న బత్తుల సిద్దేశ్వర ఆరోగ్యం క్షీణించిందని, తక్షణమే కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు సిద్దేశ్వర తో మాట్లాడి దీక్ష విరమింప చేసేలా చర్యలు తీసుకోవాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు.
బత్తుల సిద్దేశ్వర ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుందని, ఈ దశలో కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆయనకు ప్రాణ అని కలిగే ప్రమాదం ఉందని శ్రీనివాస్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. బిసి ఉద్యమకారుని ప్రాణాలకు హాని జరిగితే కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. రెండు రోజుల్లోనే సిద్దేశ్వరకు మద్దతుగా హైదరాబాదులో అఖిలపక్ష పార్టీలు, బిసి సంఘాలు, కుల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి దేశవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుడుతామని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.