సైనికుల కోసం ప్రతి ఒక్కరూ దివ్వెలు వెలిగించండి
ట్విట్టర్లో ప్రధాని పిలుపు
న్యూఢిల్లీ: ఏటా దీపావళి పండుగను ఆర్మీ జవాన్ల మధ్య జరుపుకొనే సంప్రదాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాది కూడా కొనసాగించనున్నారు. సరిహద్దుల వెంబడి పహరా కాస్తున్న సైనికులతో దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ శనివారం రాజస్థాన్లోని జైసల్మేర్ వెళతారని విశ్వసనీయ వర్గాలద్వారా తెలిసింది. అయితే జైసల్మేర్కు బదులు ఆయన గుజరాత్లోని భుజ్కు వెళ్లే అవకాశాలున్నాయని కూడా చెప్తున్నారు. ప్రధాని వెంట త్రివిధ దళాల ప్రధానాధికారి ( చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) బిపిన్ రావత్ కూడా వెళ్లవచ్చని తెలుస్తోంది. గత ఏడాది ప్రధాని జమ్మూ, కశ్మీర్లోని రాజౌరీ జిల్లా వెళ్లి నియంత్రణ రేఖ వెంబడి విధులు నిర్వహిస్తున్న జవాన్లతో దీపావళి వేడుకలు జరుపుకొన్నారు. మోడీ ప్రధాని అయినప్పటినుంచి ప్రతి ఏడాది ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
కాగా తన పర్యటన నేపథ్యంలో ప్రధాని సరిహద్దుల్లో మన దేశాన్ని కాపాడుతున్న సైనికుల కోసం ప్రతి క్కరూ దీపాలు వెలిగించాలంటూ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. ‘ ఈ దీపావళి నాడు మన దేశాన్ని మొక్కవోని ధైర్యంతో కాపాడుతున్న మన సైనికులకు సెల్యూట్గా మనమంతా ఒక దివ్వెను వెలిగిద్దాం. మన సైనికులు ప్రదర్శిస్తున్న అసమాన ధైర్య సాహసాలకు కృతజ్ఞత తెలియజేయడానికి మాటలు సరిపోవు. సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్ల కుటుంబాలకు కూడా మనం కృతజ్ఞులుగా ఉండాలి’ అని ఆయన ఆ ట్వీట్లో పేర్కొన్నారు.