సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ
మన తెలంగాణ / హైదరాబాద్ : విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం ముద్దాయిగా ఉన్న భారత కార్పొరేట్ దిగ్గజం అదానీని రక్షించేందుకే ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ప్రధాన ఉద్దేశ్యంగా కన్పిస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ ధ్వజమెత్తారు. ఈ మేరకు అమెరికా పార్లమెంట్ ముందు నుంచి సోషల్ మీడియా వేదికగా నారాయణ ఆదివారం ఒక వీడియో సందేశం ఇచ్చారు. మోడీ అమెరికా పర్యటనలో భాగంగా వాష్టింగటన్లో ఒక వైపు ట్రంప్ను కలిశారని, మరోవైపు ఎలాన్మస్క్ను కలిశారని నారాయణ గుర్తుచేశారు.
మోడీ చాలా మంచివారని ట్రంప్ మాట్లాడుతున్నారన్నాడని, అయితే మస్క్ను కలిసిన తర్వాత అర్థమైంది ఏమిటంటే ఇప్పటికే న్యూయార్క్ కోర్టులో భారతదేశ కార్పొరేట్ దిగ్గజమైన అదానీపైన లంచం కేసు ఒకటి నమోదైందని నారాయణ గుర్తుచేశారు. ఇదే అమెరికా గడ్డ వేదికగా గత వైసిపి ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పంద వ్యవహారంపై ఈ లంచం వ్యవహారం వెలుగు చూసిందన్నారు. ఈ ఒప్పందంలో దాదాపు 2లక్షల కోట్లు అదానీకి లాభం చేకూర్చేటట్లుగా, ఆంధ్రప్రదేశ్ ప్రజానికంపై భారం మోపేలా ఈ ఒప్పందాలు జరిగాయని వివరించారు. దీంతో అదాని ముద్దాయిగా ఆరోపణలున్నాయని, దీనిపై ఫిర్యాదు రావడంతో న్యూయార్క్ కోర్టులో కేసు నమోదైందని చెప్పారు. మోడీ అమెరికా పర్యటనలో భాగంగా మస్క్తో భేటీ అనంతరం..ఇది అదానీని రక్షించేందుకేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
అమెరికాలోని కార్పొరేట్ దిగ్గజం, భారత్లోని కార్పొరేట్ దిగ్గజం ఒక్కటే కాబట్టి, అదానీని కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని నారాయణ విమర్శించారు. ఈ కేసును నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, అదే జరిగితే భారతదేశ ప్రజానీకానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. జాతీయ స్థాయిలో ఉన్న ప్రధాని మోదీ అమెరికాకు వచ్చిన తర్వాత ఇలాంటి అంశాలపై నీరు గార్చడం చాలా విచారకరమని అన్నారు. అటు ట్రంప్ పరిస్థితి చూస్తే మా ఇంటికి వస్తే ఏం తెస్తావు?, మీ ఇంటికి వస్తే ఏం ఇస్తావు ? అనే దిశగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో ప్రధాని నిష్పక్షపాతంగా ఉండలేకపోయాన్నారు. ఒక వైపు అవినీతిని ప్రోత్సహించడం, మరోవైపు భారత దేశానికి ట్రంప్ను రమ్మని ఆహ్వానించడం తగదన్నారు. ఈ సంఘటనలతో అంతర్జాతీయ కుంభకోణాల్లో భారత ప్రభుత్వం కూరుకుపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ పర్యటనతో జాగ్రత్త పడాల్సిన అవసరముందని నారాయణ సూచించారు.