న్యూఢిల్లీ : ప్రపంచం లోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ఘనంగా ముగిసింది. 45 రోజుల పాటు సాగిన ఈ కుంభమేళా విశేషాలను ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తన బ్లాగ్లో రాశారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అంత సులువు కాదన్నారు. ఏర్పాట్ల విషయంలో భక్తులెవరైనా అసౌకర్యానికి గురైతే గనుక అందుకు క్షమించాలని కోరారు. “ ఐక్యత కోసం జరిగిన మహా యజ్ఞం దిగ్విజయంగా ముగిసింది. అంచనాలను మించి వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. భారత్ కొత్త శక్తితో ముందుకు సాగుతోందని, నవభారత్ను నిర్మించే కొత్త శకం వచ్చిందని చెప్పేందుకు ఇదే నిదర్శనం ” “ ఇంత గొప్ప కార్యక్రమాన్ని దేనితోనూ పోల్చలేం.
..త్రివేణీ సంగమం నదీ తీరానికి అన్ని కోట్ల మంది ఎలా వచ్చారా ? అని యావత్ ప్రపంచం ఆశ్చర్య పోతోంది. ఈ భక్తులెవరికీ అధికారిక ఆహ్వానాలు పంపలేదు. అయినా పవిత్ర సంగమంలో పుణ్యస్నానాల కోసం వారంతా తరలి వచ్చారు. నదిలో స్నానమాచరించిన తరువాత వారి ముఖాల్లో కన్పించిన సంతోషం , సంతృప్తి నేనెప్పటికీ మర్చిపోలేను. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు చాలా మంది వ్యయప్రయాసల కోర్చి కుంభమేళాకు రావడం ఆనందంగా ఉంది ” అని మోడీ రాసుకొచ్చారు.
ఈ సందర్భంగా మహాకుంభమేళాను విజయవంతం చేసిన యూపీ ప్రభుత్వం , సహకరించిన ప్రయాగ్రాజ్ ప్రజలు , భక్తులకు మోడీ ధన్యవాదాలు తెలిపారు. “ ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడం అనేది అంత సులువు కాదని తెలుసు. మా పూజల్లో ఏదైనా లోపం ఉంటే క్షమించాలని ఆ గంగా, యమునా, సరస్వతి మాతలను ప్రార్థిస్తున్నా. భగవంతుని స్వరూపాలుగా భావించే భక్తులకు సేవ చేయడంలో ఏదైనా లోపం ఉంటే అందుకు ప్రజలు కూడా క్షమించాలని కోరుతున్నా ” అని మోడీ రాసుకొచ్చారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు ఈ మహాకుంభమేళా సాగింది.