టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి తన ఖాతాలో అరుదైన రికార్డును జమ చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో షమి ఘనతను దక్కించుకున్నాడు. వన్డే క్రికెట్లో అతి తక్కువ బంతుల్లో 200 వికెట్లను సాధించిన బౌలర్గా షమి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. షమి 5,126 బంతుల్లోనే ఈ మార్క్ను అందుకున్నాడు. ఈ క్రమంలో మిఛెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న రికార్డును షమి తిరగరాశాడు. స్టార్క్ 5,240 బంతుల్లో 200 వికెట్ల మైలురాయిని సాధించాడు. బంగ్లాదేశ్ మ్యాచ్లో షమి అద్భుత బౌలింగ్ను కనబరిచాడు. 53 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లను పడగొట్టాడు.
అంతేగాక మరో రికార్డును కూడా షమి తన పేరిట నమోదు చేసుకున్నాడు. ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీలలో కలిపి షమి ఇప్పటి వరకు 60 వికెట్లను పడగొట్టాడు. దీంతో ఈ టోర్నీల్లో అత్యధిక వికెట్లను తీసి భారత బౌలర్గా రికార్డు సృష్టించాడు. జహీర్ ఖాన్ (59), శ్రీనాథ్ (47), రవీంద్ర జడేజా (43) తర్వాతి స్థానాల్లో నిలిచారు. కాగా సొంత గడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్లో కూడా షమి అద్భుత బౌలింగ్తో అలరించిన సంగతి తెలిసిందే. భారత్ను ఫైనల్కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా బంగ్లాతో జరిగిన మ్యాచ్లోనూ ఐదు వికెట్లతో మెరిశాడు.