హైదరాబాద్ : ఈ ఏడాది నుంచే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కొండపోచమ్మసాగర్ వరకు తరలించడానికి అవసరమైన పంపింగ్ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన సిద్దం చేస్తున్నట్టు ట్రాన్స్కో, జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్రావు ప్రకటించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పంపుహౌజ్లను సిఎండి ప్రభాకర్రావు శుక్రవారం సందర్శించారు. అక్కడ సాగుతున్న విద్యుత్ నిర్మాణపు పనులను ఆయన తనిఖీ చేశారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజరాజేశ్వర స్వామి(మిడ్మానేరు) రిజర్వాయర్ నుంచి కొండపోచమ్మసాగర్ వరకు అన్ని దశల్లో పంపుహౌజ్ల నిర్మాణం పూర్తికావాలని, ఈ ఏడాది నుంచి నీటిని పంపు చేయాలనే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని ఆయన కోరారు.
వచ్చే ఏడాదిలో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు మూడు టిఎంసిలను, మిడ్మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు రెండు టిఎంసిలను తరలించడానికి అవసరమైన విద్యుత్ సరఫరాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభాకర్రావు తెలిపారు. ఈ సందర్భంగా పంపుల ఏర్పాటు పనులు నిర్వహిస్తున్న సీమెన్స్ కంపనీ ప్రతినిధులతో చర్చించారు. అనంతసాగర్(ప్యాకేజీ 10), రంగనాయకసాగర్(ప్యాకేజీ 11), మల్లన్నసాగర్(ప్యాకేజీ 12)ల పంపు హౌజ్లను, సబ్స్టేషన్లను పరిశీలించారు. 424 మెగావాట్ల సామర్థం (106 x 4) కలగిన అనంతసాగర్ పంపులు 536 మెగావాట్ల సామర్థం(134.8 x 4) ఉన్న రంగనాయకసాగర్ పంపులు నీటిని పంపుచేయడానికి సిద్దమయ్యాయన్నారు. వాటి పనితీరును సిఎండి పరిశీలించి, పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు.
344 మెగావాట్ల సామర్థం(43 x 8) కలిగిన మల్లన్నసాగర్ పంపుహౌజ్లో 4 పంపులు పనిచేయడానికి కావాల్సిన విద్యుత్తు సంబంధిత పనులు పూర్తయినట్టు ప్రభాకర్రావు తెలిపారు. మిగతా 4 పంపులకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని, ఈ పంపులకు విద్యుత్ సరఫరా చేయడానికి కావాల్సిన సబ్స్టేషన్ల నిర్మాణం, కరెంటు సరఫరా తదితర పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగతా నాలుగు పంపులను కూడా ఈ నెలాఖరులోగా బిగించాలని సిఎండి ప్రభాకర్రావు అధికారులను ఆదేశించారు.
వచ్చే ఏడాది నుంచి మేడిగడ్డ నుంచి 3 టిఎంసిలను ఎత్తిపోయాలని సిఎం కెసిఆర్ లక్షంగా నిర్ణయించినందున అందుకు సంబంధించిన విద్యుత్ సరఫరా పనులను కూఆ యుద్ద ప్రాతిపదికన చేపట్టనున్నట్టు ప్రభాకర్రావు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా మూడో టిఎంసిని ఎత్తిపోయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు అవసరమైన విద్యుత్తును కూడా సమకూర్చుకోవడదానికి తగిన కార్యచరణ సిద్దం చేసినట్టు తెలిపారు. సిఎండి వెంట ట్రాన్స్కో జెఎండి సి. శ్రీనివాసరావు, డైరెక్టర్ సూర్యప్రకాశ్, ఇడి ప్రభాకర్రావు, ఎస్ఇ ఆనందర్, నీటి పారుదల విభాగం సలహాదారు పెంటారెడ్డి తదితరులు ఉన్నారు.