ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి, 140 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్పై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. దీనిని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. ప్రజలు ఉప ముఖ్యమంత్రిని చేసినప్పుడు నాయకుడు ఆలోచించి మాట్లాడాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ నాయకులపై పాక్పై ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లాలని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని భారతదేశాన్ని కాపాడే పార్టీ అని ఆయన అన్నారు. నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే, 7 రేస్ కోర్స్(7 రేస్ కోర్స్ రోడ్డు లేదా 7 ఆర్సిఆర్ అనేది భారత ప్రధానమంత్రి నివాసం) వెళ్లి కలవాలని ఆయన డిప్యూటీ సిఎం పవన్కళ్యాణ్కు సూచించారు.
లేకుంటే పవన్కళ్యాణ్ రాజకీయాలు మానేసి, రెండు సినిమాలు తీసి నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడవద్దని ఆయన సూచించారు. నలుగురు వచ్చి కాల్చిపోతే మీరు పిట్ట కథలు చెప్పుకుంటూ తిరుగుతున్నారని, నలుగురు ముష్కరులు 28 మందిని చంపితే వారం రోజుల నుంచి అరెస్టు చేయకుండా ఎవరి వైఫల్యం జరిగిందో కేంద్రాన్ని అడగాలని ఆయన సూచించారు. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా? ఇంటెలిజెన్స్ వైఫల్యమా? కాశ్మీర్లో 370 ఆర్టికల్ అమలు చేసి ప్రశాంత వాతావరణం తీసుకొచ్చామని చెప్పిన నరేంద్ర మోడీ దీనికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.