Saturday, July 6, 2024

హామీల అమలుపై కాంగ్రెస్ నేతల కాలయాపన :ఎంపి రఘునందన్ రావు

- Advertisement -
- Advertisement -

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా మాట్లాడారని, ఇప్పుడు దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. హామీల అమలుపై కాంగ్రెస్ నేతలు కాలయాపన చేస్తున్నారని, మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా హామీలను అమలు చేయడంలేదని ధ్వజమెత్తారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పారని గుర్తు చేశారు. డిసెంబర్ 9వ తేదీనే రుణమాఫీ చేస్తామని ఆరోజు చెప్పారని, కానీ అది పోయిందన్నారు. ఆ తర్వాత ఆగస్టు 15 అన్నారని, ఇప్పుడేమో కమిటీ వేసి ఎవరికి ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో పరిశీలిస్తామని చెబుతున్నారని మండిపడ్డారు.

భూమి ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలన్నారు. అధికారం కోసం మోసపూరిత హామీలు ఇచ్చారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు మేనిఫెస్టో మీద కూడా గౌరవం లేదని, అభయహస్తం మేనిఫెస్టోలో వరి ధాన్యానికి రూ.2683 రూపాయల మద్ధతు ధర ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతుల కష్టాలు పట్టించుకోకుండా కాంగ్రెస్ నాయకులు టైంపాస్ చేస్తున్నారని, రేవంత్‌రెడ్డి అడుగులు తడబడుతున్నాయని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేనాటికి మరో 15 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోలేని పరిస్థితిలో భారత రాష్ట్ర సమితి ఉందన్నారు. ఐదు రోజులు ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయాలు తప్ప అభివృద్ధి కోసం ఆలోచించడంలేదని రఘునందనరావు వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News