వడోదర: మహిళల ఐపీఎల్ మ్యాచ్లు శుక్రవారం నుంచి ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అయితే ప్రారంభమైన రెండో రోజే వివాదానికి తెరలేచింది. శనివారం ముంబై ఇండియాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు విజయం సాధించింది. కానీ, ఈ మ్యాచ్లో థర్డ్ అంపైర్ నిర్ణయం అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తోంది. ఈ నిర్ణయమే తమ జట్టు ఓటమి కారణం అంటూ ముంబై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 19.1 ఓవర్లలో 164 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి విజయం సాధించింది. ఆఖరి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉంది. ముంబై బౌలర్ సజనా వేసిన ఆఖరి బంతిని ఢిల్లీ బ్యాటర్ అరుంధతి కవర్స్ మీదుగా ఆడింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ముంబై కెప్టెన్ హర్మన్ప్రీత్ బంతిని అందుకొని కీపర్కు చేరవేసింది. అప్పటికే ఒక పరుగు పూర్తి చేసిన అరుంధతి.. రెండో పరుగు కోసం ప్రయత్నించి క్రీజ్ లోకి డైవ్ చేసింది.
మరోవైపు బంతిని అందుకున్న వికెట్ కీపర్ కూడా బంతిని స్టంప్స్కి గిరాటేసింది. దీంతో అరుంధతి ఔట్ అయిందని భావించిన ముంబై ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్ చూస్తున్న వారందరూ కూడా సూపర్ ఓవర్ ఖాయమని అనుకున్నారు. కానీ, థర్డ్ ఎంపైర్ మాత్రం.. అరుంధతి క్రీజ్లోకి వచ్చే ముందు స్టంప్స్ లైట్ వెలిగాయి కానీ, బెయిల్స్ కింద పడక పోవడంతో దాన్ని నాటౌట్గా ప్రకటించారు. దీంతో మ్యాచ్ ఢిల్లీ సొంతమైంది. ఇప్పుడు ఈ నిర్ణయమే ముంబై ఫ్యాన్స్ను ఆగ్రహానికి గురి చేస్తుంది. థర్డ్ ఎంపైర్ నిర్ణయం సరిగ్గా లేవని.. ఇది గల్లీ క్రికెట్ కాదు అంటూ వాళ్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.