ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఐదుసార్లు ట్రోఫీ విజేత నిలిచిన ఈ జట్టును ఎదురుకోవాలంటే.. ప్రత్యర్థు కాస్త భయపడాల్సిందే. అలాంటి ముంబై జట్టు ఈ సీజన్ ఆరంభంలో తడబడింది. ఆడిన ఐదు మ్యాచుల్లో కేవలం ఒక మ్యాచ్లోనే విజయం సాధించింది. దీంతో ముంబై ఈసారి ప్లేఆఫ్స్కి వెళ్లడం కష్టమే అని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ముంబై తిరిగి ఫామ్లోకి వచ్చిన ఆ తర్వాతి ఐదు మ్యాచ్లలో వరుసగా అన్నింటిలో విజయం సాధించి తమకు తామే సాటి అని నిరూపించుకుంది.
ఆదివారం లక్నోపై సాధించిన విజయంతో ముంబై ఇండియన్స్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. లక్నోపై గెలుపు ఈ సీజన్లో ముంబైకి వరుసగా ఐదో విజయం మాత్రమే కాకుండా.. మొత్తం ఐపిఎల్ చరిత్రలో 150వ విజయం. దీంతో ఐపిఎల్లోనే అత్యధిక మ్యాచ్లలో విజయం సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ముంబై తర్వాతి స్థానంలో 140 మ్యాచ్లతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఉంది. ఆ తర్వాత స్థానాల్లో కోల్కతా నైట్ రైడర్స్(134), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(129), ఢిల్లీ క్యాపిటల్స్(112) ఉన్నాయి.