Monday, October 21, 2024

ఇవిఎంలపై మళ్లీ మస్క్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

ఎఐతో వాటిని హ్యాక్ చేయవచ్చని ఆరోపణ
అమెరికా ఎన్నికల్లో ఇవిఎంలు వాడవద్దని డిమాండ్
బ్యాలట్ ద్వారా పోలింగ్ నిర్వహించాలన్న స్పేస్ ఎక్స్ బాస్

న్యూయార్క్ : ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్ (ఇవిఎం)లపై స్పేస్ ఎక్స్ అధినేత, వాణిజ్య దిగ్గజం ఎలాన్ మస్క్ మరొకసారి సంచలన ఆరోపణలు చేశారు. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఎఐ) సాయంతో ఇవిఎంలను హ్యాక్ చేయవచ్చునని మస్క్ ఆరోపించారు. ఒక టెక్ నిపుణుడిగా తనకు ఉన్న పరిజ్ఞానంతో ఈ విషయం చెబుతున్నానని ఆయన తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇవిఎంలను ఉపయోగించవద్దని, బ్యాలట్ పేపర్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని మస్క్ కోరారు. ఇటీవల పెన్సిల్వేనియాలో జరిగిన డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎలాన్ మస్క్ మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్నికలకు దూరంగా ఉంచాలని కోరారు.

ఎన్నికల్లో వోట్ల లెక్కింపు చేతులతో లెక్కించే బ్యాలట్ పేపర్‌తో జరగాలని ఆయన సూచించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఒక సాంకేతిక నిపుణుడిగా కంప్యూటర్ల గురించి నాకు బాగా తెలుసు. కంప్యూటర్ ప్రోగ్రామ్‌లను హ్యాక్ చేయడం చాలా సులభం. పేపర్ బ్యాలట్ విషయంలో ఆ అవకాశం లేదు. ప్రజాస్వామ్య దేశాల్లో పేపర్ బ్యాలట్ ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలి’ అని మస్క్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, ఇండియాలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన కొన్ని రోజుల తరువాత ఇవిఎంలను హ్యాక్ చేసే అవకాశం ఉందని, వాటి వాడకాన్ని రద్దు చేయాలని ఎలాన్ మస్క్ పిలుపు ఇచ్చిన విషయం విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News