వక్ఫ్ బిల్లుపై ఎంఐఎం పార్టీ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ బిల్లుపై చట్ట విరుద్ధంగా ఉందని.. ఈ నెల 19న బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లో జరిగే ఈ నిరసన కార్యక్రమంలో ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఆదివారం అసదుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. వక్ఫ్ ఆస్తులను నాశనం చేయడానికే బిల్లు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముస్లిమేతరుడిని సభ్యుడిగా ఎలా చేర్చుతారని ప్రశ్నించారు. వక్ఫ్ అంటేనే తన దృష్టిలో ఓ ప్రార్థనా స్థలమన్నారు. “వక్ఫ్ బిల్లుకు చంద్రబాబు, నితీష్ మద్దతిచ్చారు. ముస్లింలకు వ్యతిరేకంగా మోదీ సర్కార్ పనిచేస్తోంది. ఆర్టికల్ 26కు విఘాతం కలుగుతోంది. వక్ఫ్పై బీజేపీ చెప్పేవన్నీ అబద్ధాలే. వక్ఫ్ బిల్లుతో ముస్లింలకు తీవ్ర నష్టం. ఈ బిల్లుపై మోదీ మరోసారి ఆలోచించాలి” అని అసదుద్దీన్ పేర్కొన్నారు.