ఆ దరిమిలా వారి చేతుల్లో ఏ భారత పౌరుడూ ప్రాణం కోల్పోరు
హోమ్ మంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ : 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సల్స్ అంతం అవుతారని, వారి కారణంగా దేశంలో ఏ పౌరుడూ ప్రాణం కోల్పోవలసి రాదని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం సూచించారు. ఛత్తీస్గఢ్లో 31 మంది నక్సల్స్ను భద్రత బలగాలు అంతం చేసిన తరువాత అమిత్ షా ఈ విషయం చెప్పారు. ‘2026 మార్చి 31 లోగా దేశంలో నుంచి నక్సలిజాన్ని మేము పూర్తిగా తుడిచిపెట్టగలమన్న నా దృఢ సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తున్నాను. ఆ తరువాత నక్సలిజం కారణంగా దేశంలో ఏ పౌరుడూ ప్రాణం కోల్పోవలసి రాదు’ అని అమిత్ షా ‘ఎక్స్’లో హిందీ పోస్ట్లో తెలిపారు.
భారత్ను నక్సల్ రహితంగా చేసే దిశగా భద్రత దళాలు ఛత్తీస్గఢ్ బీజాపూర్లో భారీ విజయం సాధించారని హోమ్ శాఖ మంత్రి తెలిపారు. ఆ ఘటనలో 31 మంది నక్సలైట్లు హతమయ్యారని, భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు వస్తువులు స్వాధీనం చేసుకున్నారని ఆయన తెలిపారు. ‘మానవాళి వ్యతిరేక నక్సలిజాన్ని అంతం చేసే యత్నం’లో భద్రత దళాలు తమ ధీర జవాన్లు ఇద్దరిని కూడా కోల్పోయాయని, ఆ హీరోలకు దేశం సదా రుణపడి ఉంటుందని అమిత్ షా తెలిపారు. ‘అమరులైన జవాన్ల కుటుంబాలకు నా హృదయపూర్వకక సంతాపం తెలియజేస్తున్నాను’ అని అమిత్ షా తన పోస్ట్లో పేర్కొన్నారు.