Tuesday, September 17, 2024

మార్కెట్ లో పోటీకి ధీటుగా కొత్త బస్సులు అందుబాటులోకి…

- Advertisement -
- Advertisement -
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

హైదరాబాద్ : ప్రజలకు మరింతగా మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్షంగా ముందుకెళుతున్నామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మార్కెట్ లో పోటీకి ధీటుగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం బస్ స్టేషన్లను ఆధునిక హంగులతో సుందరీకరిస్తున్నామని ఆయన తెలిపారు. మంగళవారం మంత్రి పువ్వాడ, ఆర్టీసి ఎండి సజ్జనార్‌తో కలిసి ఎంజీబీఎస్‌ను తనిఖీ చేశారు. అనంతరం రంగారెడ్డి రీజియన్‌కు సంబంధించి ఆర్టీసి ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఆర్ధిక ఏడాదిలో 100 బస్టాండ్లను ఆధునీకరించగా, ఈ ఏడాదిలో 150 బస్టాండ్లను ఆధునీకరించేందుకు సంస్థ ప్రణాళిక రూపొందించిందని ఆయన వివరించారు.
మెట్రో, రైల్వే, ఎయిర్ పోర్టు అథారిటీతో అనుసంధానం….
రెండేళ్లలో ఎన్నో వినూత్న కార్యక్రమాలతో సంస్థ ప్రజలకు మరింతగా చేరువ అయ్యిందని మంత్రి అన్నారు. గతేడాది రూ.1900 కోట్ల నష్టాన్ని తగ్గించగలిగామని ఆయన గుర్తుచేశారు. ప్రయాణికులకు సౌకర్యాల విషయంలో ఏమాత్రం రాజీ పడటం లేదన్నారు. ఇప్పటికే 760 కొత్త బస్సులను కొనుగోలు చేశామని, త్వరలోనే హైదరాబాద్ లో నాన్ ఎసి ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని ఎండి తెలిపారు. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని, మెట్రో, రైల్వే, ఎయిర్ పోర్టు అథారిటీతో అనుసంధానం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాలని అధికారులకు సూచించారు.
సిబ్బంది పట్టుదలతో…
రెండేళ్లుగా సంస్థలోని 45 వేల మంది సిబ్బంది పట్టుదలతో పనిచేస్తున్నారని, వారు నిబద్ధతతో విధులు నిర్వహించడం వల్లే సత్పలితాలు వస్తున్నాయని మంత్రి చెప్పారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇప్పటి వరకు 7 డిఏలను ప్రకటించామని, దాని వల్ల ఒక్కోక్కరి వేతనం 35 శాతం వరకు పెరిగిందన్నారు. ప్రజ రవాణా వ్యవస్థ ప్రజలదేనని, దైనందిన జీవనంలో భాగమైన ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యతపై ప్రతి పౌరుడిపై ఉందని మంత్రి గుర్తుచేశారు.
ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై మంత్రి ఆరా
తనిఖీలో భాగంగా మంత్రి పువ్వాడ బస్‌స్టేషన్‌లో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. టిఎస్ ఆర్టీసి ఉచితంగా అందిస్తోన్న టాయిలెట్‌లను, మంచినీటి సదుపాయాన్ని పరిశీలించారు. ఎంజీబీఎస్‌లోని స్టాళ్లను పరిశీలించిన మంత్రి పువ్వాడ ఎంఆర్‌పి ప్రకారమే వస్తువులను ప్రయాణికులకు విక్రయించాలని ఆయన సూచించారు. తర్వాత భద్రాచలం వైపునకు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సులోని ప్రయాణికులతో మంత్రి ముచ్చటించారు. టిఎస్ ఆర్టీసి కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
ఆక్యుపెన్సీని 75 శాతానికి పెంచడమే లక్షంగా…
ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ మాట్లాడుతూ రెండేళ్లుగా సంస్థను ప్రజలు ఆదరిస్తున్నారని, ఫలితంగా రాబడి కూడా పెరుగుతుందన్నా. రాబోయే రోజుల్లో ఆక్యుపెన్సీ రేషియాను 75 శాతానికి పెంచడమే లక్ష్యంగా సంస్థ పనిచేస్తోందన్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనను బట్టి కొత్త కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నామని ఆయన వివరించారు. భక్తుల కోసం త్వరలోనే మహారాష్ట్రలోని షిర్డీ, ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలానికి టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు. గురు పౌర్ణమి సందర్భంగా జూలై 3వ తేదీన తమిళనాడు అరుణాచలంలో జరిగే గిరి ప్రదర్శన ప్యాకేజీకి భక్తుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని ఎండి చెప్పారు. ఇప్పటికే 9 బస్సుల్లో సీట్లు నిండాయని, త్వరలోనే మరికొన్ని బస్సులను ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. ఒకవైపు టికెట్ ఆదాయాన్ని పెంచుకుంటూనే మరోవైపు టికెటేతర ఆదాయంపై సంస్థ దృష్టి సారించిందన్నారు. ఈ నేపథ్యంలోనే జీవా వాటిల్ బాటిళ్లు, స్నాక్ బాక్స్ తో పాటు పెట్రోల్ బంక్ ల ఏర్పాటు, లాజిస్టిక్స్ కార్గో సేవలను అందిస్తున్నామని ఆయన వివరించారు.
ఎంజీబిఎస్ ప్రాంగణంలో రక్తదాన శిబిరం ప్రారంభం
ఎంజీబీఎస్ ప్రాంగణంలో ఆర్టీసి ఎండి విసి సజ్జనార్‌తో కలిసి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదాతలతో ముచ్చటించారు. వారికి పండ్లు, జ్యూస్‌ను అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 101 ప్రాంతాల్లో సామాజిక బాధ్యతగా ఆర్టీసి మెగా రక్తదాన శిబిరాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని 8 వేల మంది సిబ్బంది రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారని, వారికి మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని, దానం ఒక్కటే మార్గమన్నారు. అంతకముందు ఎంజీబిఎస్ ప్రాంగణంలో ఆర్టీసి ఎండి సజ్జనార్‌తో కలిసి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమాల్లో ఆర్టీసి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం, మునిశేఖర్, కృష్ణకాంత్, రంగారెడ్డి ఆర్‌ఎం శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

Planting

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News