Saturday, June 29, 2024

జులై 1 నుంచే కొత్త నేర న్యాయ చట్టాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బ్రిటిష్ వలస పాలన నాటి ఐపిసి, సీఆర్‌పీసీ, ఐఈఏ చట్టాల స్థానంలో ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023, భారతీయ సాక్ష అధినియమ్ 2023 పేరుతో మూడు చట్టాలు జులై 1 నుంచి దేశ వ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. జీరో ఎఫ్‌ఐఆర్, ఆన్‌లైన్‌లో పోలీస్ ఫిర్యాదు, ఎలక్ట్రానిక్ రూపం లోనే సమన్లు, దారుణమైన నేరాలకు సంబంధించి నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో చిత్రీకరించడం వంటివి కీలక అంశాలుగా ఇందులో ఉండనున్నాయి. ఈ కొత్త చట్టాల ప్రకారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లనవసరం లేకుండానే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే వీలు కలుగనుంది. తద్వారా తేలికగా, వేగంగా సమస్యను తెలియజేయడంతోపాటు పోలీస్‌ల స్పందనను సులభతరం చేస్తుంది.

ఏదైనా సంఘటన సమాచారాన్ని ఏ పోలీస్ స్టేషన్‌కైనా ఆన్‌లైన్‌లో తెలియజేయవచ్చు. జీరో ఎఫ్‌ఐఆర్ ప్రకారం… ఏ వ్యక్తి అయినా పోలీస్‌స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. బాధితులతోపాటు నిందితులు కూడా ఎఫ్‌ఐఆర్ కాపీలను ఉచితంగా పొందే వీలుంది. వీటితోపాటు పోలీస్ రిపోర్టు, ఛార్జిషీట్,స్టేట్‌మెంట్లు ఇతర డాక్యుమెంట్లు, 14 రోజుల్లోగా పొందవచ్చు. అరెస్ట్ సందర్భాల్లో బాధితుడు తమ సన్నిహితులు,బంధువులకు , ఆ పరిస్థితిని తెలియజేసే హక్కు ఉంటుంది. తద్వారా తక్షణ సహాయం పొందేందుకు వీలు కలుగుతుంది. తీవ్రమైన నేరాల్లో ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరిగా సంఘటన స్థలాన్ని పరిశీలించాలి.

సాక్షాలు తారుమారు కాకుండా ఉండేందుకు నేరం జరిగిన ప్రదేశంలో ఆధారాలు సేకరించేక్రమాన్ని వీడియో చిత్రీకరించాలి. పిల్లలు, మహిళలపై నేరాల్లో బాధితులకు ప్రాథమిక చికిత్స లేదా పూర్తి వైద్యం ఉచితంగా అందించాల్సి ఉంటుంది. అత్యాచార నేరాల కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా పోలీస్‌లు నమోదు చేయాలి. మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్థులతోపాటు 15ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం నుంచి మినహాయింపు ఉంటుంది. వారు నివాసం ఉన్న చోటే పోలీస్‌ల సాయం పొందవచ్చు. స్వల్ప నేరాలకు సంబంధించి నేరస్థులకు సమాజసేవ చేసే అవకాశాన్ని కొత్త చట్టాలు కల్పిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News