హైదరాబాద్: అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజున సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో సుమారు లక్ష మంది మహిళలతో సభ నిర్వహిస్తామని.. మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఆ రోజున పలు కొత్త పథకాలకు శ్రీకారం చుడుతామని ఆమె అన్నారు. ప్రధానంగా ఇందర మహిళ శక్తి పాలసీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేస్తారని ఆమె పేర్కొన్నారు. పట్టణాల్లో మహిళా సంఘాలను బలోపేతానికి సిఎం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ఆమె అన్నారు.
గడిచిన ఏడాది కాలంలో ప్రమాదవశాత్తు మరణించిన 400 మంది మహిళలకు రూ.40 కోట్ల బీమా చెక్కులను సిఎం అందిస్తారన్నారు. దాంతో పాటుగా 32 జిల్లాల్లో 64 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలను సిఎం వర్చువల్గా ప్రారంభిస్తారని.. వడ్డీ లేని రుణాల చెక్కులను సిఎం పంపిణీ చేస్తారని తెలిపారు. నారాయణపేట జిల్లాలో మహిళలే నిర్వహించే పెట్రోల్ బంకులు ఉన్నట్లు.. అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు మహిళ దినోత్సవం రోజు చమురు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుందని పేర్కొన్నారు.