అమరావతి: ఈ- కేవైసి ప్రక్రియ పూర్తయ్యాక కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ఎపి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మే నెల నుంచి ఎటిఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని అన్నారు. ఆయన నెల్లూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డులకు ఆప్షన్లు ఉంటాయన్నారు. క్యూఆర్ కోడ్, ఇతర భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. ఈ- కేవైసి పూర్తయితే ఎంతమందికి కార్డులు ఇవ్వాలో స్పష్టత వస్తుందని తెలియజేశారు. నేటి నుంచి దీపం-2 రెండో విడత సిలిండర్ బుకింగ్ ప్రారంభమైందని, కొత్తగా 2 లక్షల మంది గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారని కంపెనీలు చెప్పాయని పేర్కొన్నారు.
ఖరీఫ్ లో 35.93 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ధాన్యం కొన్న 24 గంటల్లోగా రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని అన్నారు. వాట్సప్ లోనూ ధాన్యం కొనుగోలు చేసేలా వెసులుబాటు కల్పించామని, మొత్తం 16 వేల మంది రైతులు వాట్సప్ ద్వారా ధాన్యం అమ్మారని చెప్పారు. ఎపి పోర్టుల ద్వారా తెలంగాణ లక్షన్నర టన్నుల బియ్యం ఎగుమతి చేసిందని, ఎగుమతులకు కేంద్రం అనుమతి మంజూరు చేసిందని అన్నారు.. జూన్ నుంచి మధ్యాహ్న భోజన పథకానికి సన్న బియ్యం సరఫరా జరుగుతుందని వెల్లడించారు. ఎండియూల కొనుగోలు పెద్ద కుంభకోణం.. దీనిపై విచారణ జరుగుతోందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.