Friday, September 20, 2024

కొత్తగా 200 ఎంబిబిఎస్ సీట్లు

- Advertisement -
- Advertisement -

మరో 4 మెడికల్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్
గతంలోనే 4 నాలుగు కాలేజీలకు ఎన్‌ఎంసి అనుమతి
ఈ విద్యాసంవత్సరం మొత్తం 8 ప్రభుత్వ వైద్య కాలేజీలు ప్రారంభం
ఒక్కో కాలేజీలో 50 సీట్ల చొప్పున, అందుబాటులోకి వచ్చిన 400 ఎంబిబిఎస్ సీట్లు
కేంద్రానికి, సిఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దామోదర

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసి) అనుమతి ఇచ్చిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఈ విద్యాసంవత్సరం ఎనిమిది మెడికల్ కాలేజీలు వైద్య కళాశాలల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే నాలుగు కాలేజీలకు అనుమతి రాగా, తాజాగా యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలకు కేంద్ర ఆరోగ్యశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. ఒక్కో కాలేజీలో 50 ఎంబిబిఎస్ సీట్ల చొప్పున, మొత్తం 200 సీట్లు ఈ కాలేజీల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ములుగు, నర్సంపేట్, గద్వాల్, నారాయణపేట్ మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి ఇచ్చింది. మొత్తం 8 కాలేజీల్లో కలిపి 400 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ కాలేజీల్లోని మొత్తం ఎంబిబిఎస్ సీట్ల సంఖ్య 4090కి పెరిగింది.

ఈ విద్యాసంవత్సరం మొత్తం 8 మెడికల్ కాలేజీలకు ప్రభుత్వం దరఖాస్తు చేసుకోగా, జూన్‌లో ఈ కాలేజీల పరిశీలనకు వచ్చిన ఎన్‌ఎంసి అధికారులు, ఇక్కడ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేసింది. టీచింగ్ సిబ్బంది, సౌకర్యాలు లేకుండా అనుమతులు ఇవ్వలేమని తెలిపారు. అధికారులు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకురావడంతో, అవసరమైన నిధులను కొత్త సర్కార్ కేటాయించింది. ఎన్‌ఎంసీ లేవనెత్తిన లోపాలను సవరించి ఫస్ట్ అప్పీల్‌కు వెళ్లింది. ఈ అప్పీల్ తర్వాత ములుగు, నర్సంపేట్, గద్వాల్, నారాయణపేట్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చిన ఎన్‌ఎంసి, మిగిలిన 4 కాలేజీలకు పర్మిషన్ ఇవ్వలేదు.

ఈ కాలేజీల అనుమతులపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా రెగ్యులర్‌గా పర్యవేక్షిస్తూ యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ కాలేజీలకు సిబ్బందిని నియమించారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీలలో తొలుత ఆ 4 కాలేజీల్లోని ఖాళీలను నింపిన తర్వాతే, మిగిలిన కాలేజీల్లోకి సిబ్బందిని బదిలీ చేశారు. ప్రొఫెసర్ల కొరతను అధిగమించేందుకు అర్హులైన వారికి ప్రమోషన్లు ఇప్పించారు. కాలేజీ, హాస్పిటల్‌లో ఉండాల్సిన లాబోరేటరీ, డయాగ్నస్టిక్స్ ఎకివ్ప్‌మెంట్ కొనుగోలు చేసేందుకు నిధులు కేటాయించారు. ఈ విధంగా ఎన్‌ఎంసి లేవనెత్తిన అన్ని లోపాలను సవరించి కేంద్ర ఆరోగ్యశాఖకు సెకండ్ అప్పీల్ చేశారు. సిఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డాక్టర్ వాణి, ఇతర ఆఫీసర్లు, డాక్టర్ల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆరోగ్యశాఖ, ఎన్‌ఎంసి అధికారులను కలిశారు.

కాలేజీల ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని, ఇంకేమైనా అవసరం ఉంటే అవి కూడా సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అన్ని కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు లెటర్ ఆఫ్ పర్మిషన్ జారీ చేయాలని ఎన్‌ఎంసీని ఆదేశించింది. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, సకాలంలో అవసరమైన నిధులు కేటాయించిన సిఎం రేవంత్ రెడ్డికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కృతజ్ఞతలు తెలిపారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డాక్టర్ వాణి, అడిషనల్ డిఎంఇ విమలా థామస్, ఇతర ఉన్నతాధికారులను మంత్రి అభినందించారు. సర్కార్ దవాఖాన్లు, కాలేజీల్ విషయంలో ప్రభుత్వం నిబద్ధతతో, చిత్తశుద్ధితో ఉందని మంత్రి మరోసారి స్పష్టం చేశారు.

4090కి ఎంబిబిఎస్ సీట్ల సంఖ్య
రాష్ట్రంలో 2014 వరకు తెలంగాణలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించడంలో భాగంగా ఈ విద్యాసంవత్సరం చివరి దశ 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు కావాల్సి ఉన్నది. గత ఏడాది తొమ్మిది మెడికల్ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 26కు చేరగా, ఈ ఏడాది మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు అయితే రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 34కు చేరింది. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3690 ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులో ఉండగా, ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి లభించిన నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం అదనంగా మరో 400 ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News