జాతీయస్థాయిలో సమన్వయం, కార్యాచరణ
అమలుకు ఢిల్లీలో కార్యాలయం ఎంపిలతో
కమిటీ డీలిమిటేషన్తో నష్టపోయే రాష్ట్రాల
హక్కుల రక్షణకు తెలంగాణలో భారీ
బహిరంగసభ జెఎసి సమావేశంలో
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచనలు
ఆమోదించిన జాయింట్ యాక్షన్ కమిటీ
డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి 33శాతం సీట్లు
ఇవ్వాలని ముఖ్యమంత్రి డిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్: జనాభా ధామాషా ప్రాతిపదిక పునర్విభజను దక్షిణాది వ్యతిరేకిస్తోందని బిజెపి అనుసరిస్తున్న ఈ విధానానికి వ్యతిరేకంగా దక్షిణాది ప్రజలు, పార్టీలు, నాయకులు ఏకం కావాలని సిఎం రేవంత్ పిలుపునిచ్చారు. డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాలు ఏకమయ్యాయని, ఈ ఘనత తమిళనాడు సిఎం స్టాలిన్దేనని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. కుటుంబ నియంత్రణ విజయవంతం చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశం పెద్ద సవాల్ను ఎదుర్కొంటోందని బిజెపి జనాభా జరిమానాల విధానాన్ని కొనసాగిస్తోందని రేవంత్ అన్నారు. తమిళనాడు సిఎం స్టాలిన్ నేతృత్వంలో డీలిమిటేషన్పై ఆల్ పార్టీ మీటింగ్ శనివారం జరిగింది.
ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ 1971లో జనాభాను నియంత్రించాలని దేశం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి దక్షిణాది రాష్ట్రాలు దానిని అమలు చేస్తే ఉత్తరాది లోని పెద్ద రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విఫలమయ్యాయని ఆయన పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలన్నీ వేగంగా ఆర్థిక వృద్ధిని సాధించాయని, జీడిపి, తలసరి ఆదాయం, ఉద్యోగాల కల్పన, మెరుగైన మౌలిక వసతుల కల్పన, సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో మంచి ప్రగతి సాధించాయని రేవంత్ అన్నారు. దేశ ఖజానాకు దక్షిణాది రాష్ట్రాలు పెద్ద మొత్తంలో నిధులు ఇస్తూ తక్కువ మొత్తాన్ని పొందుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
బీహార్కు కేంద్రం నుంచి రూ.9.22లు
తమిళనాడు పన్నుల రూపంలో కేంద్రానికి రూపాయి చెల్లిస్తే 29 పైసలే వెనక్కి వస్తున్నాయని, ఉత్తర ప్రదేశ్ రూపాయికి రూ.2.73 పైసలు వెనక్కి వెళుతున్నాయని ఆయన ఆరోపించారు. బీహార్ రూపాయి చెల్లిస్తే 9.22 పైసలు వెనక్కి తీసుకుంటుంటే, కర్ణాటకకు కేవలం 14 పైసలు, తెలంగాణ 41 పైసలు, కేరళకు 62 పైసలు మాత్రమే వెనక్కి వస్తున్నాయని రేవంత్ అన్నారు. అదే సమయంలో మధ్యప్రదేశ్ రూపాయి పన్ను రూపంలో కేంద్రానికి ఇస్తే వెనక్కి రూ.2.79 పైసలు వెళుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం కేటాయింపులు పన్ను చెల్లింపులు క్రమంగా తగ్గిస్తోందని చివరకు జాతీయ ఆరోగ్య మిషన్ కేటాయింపుల్లోనూ ఉత్తరాది రాష్ట్రాలకే 60 నుంచి 65 శాతం నిధులు దక్కుతున్నాయని రేవంత్ పేర్కొన్నారు. దేశాన్ని గౌరవిస్తాం, కానీ, పునర్విభజనను ఒప్పుకోమని రేవంత్ పేర్కొన్నారు. పునర్విభజన చేపట్టకుండా బిజెపిని అడ్డుకోవాలని సిఎం రేవంత్ సూచించారు.
సీట్లు పెంచొద్దు
సీట్లు పెంచకుండా ఉన్న సీట్లతోనే పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని సిఎం రేవంత్ డిమాండ్ చేశారు. 1976లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అలాగే పునర్విభజన చేపట్టిందని ఆయన గుర్తు చేశారు. లేకుంటే రాష్ట్రాల మధ్య అసమానతలు వచ్చేవని ఆయన అన్నారు. 2001లో అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వం పునర్విభజన ప్రక్రియను అలానే ప్రారంభించిందని లోక్సభ సీట్లను అదే సంఖ్యలో ఉంచుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదే విధంగా చేయగలరా అని ఆయన ప్రశ్నించారు.
ప్రోరేటా విధానానికి వ్యతిరేకం
ప్రొరేటా విధానాన్ని అంగీకరించలేమని, ప్రొరేటా విధానం కూడా దక్షిణాదికి నష్టమే కలిగిస్తుందని, ప్రొరేటా ప్రక్రియ కూడా రాజకీయ అంతరాలను పెంచుతుందని సిఎం అన్నారు. ప్రొరేటా విధానాన్ని పాటిస్తే సీట్ల మధ్య తేడా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయిస్తుందని, ఒక్క సీటు కూడా తేడాను చూపుతుందని రేవంత్ పేర్కొన్నారు. ఒక్క సీటుతో కేంద్ర ప్రభుత్వం పడిపోయిన చరిత్ర మన దేశంలో ఉందని కాబట్టి ప్రొరేటా విధానం కూడా దక్షిణాది రాజకీయ ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని రేవంత్ అన్నారు.
పునర్విభజన చేపడితే కొన్ని రాష్ట్రాలదే ఆధిపత్యం….
బిజెపి ప్రతిపాదిస్తున్న జనాభా దామాషా పద్ధతిలో పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలైన మనం రాజకీయ గళం కోల్పోతామని సిఎం రేవంత్ అన్నారు. మనల్ని ఉత్తరాది ద్వితీయ శ్రేణి పౌరులుగా తగ్గించివేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపడితే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ఘఢ్ వంటి రాష్ట్రాలు దేశంపై ఆధిపత్యం చలాయిస్తాయని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఇదే విషయాన్ని అంగీకరిస్తారని, ఏ పరిస్థితుల్లోనూ మనం దీనికి అంగీకరించకూడదని రేవంత్ సూచించారు.
25 ఏళ్ల పాటు ఎలాంటి మార్పు వద్దు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి విధానాన్ని పాటించడమే ఉత్తమమని, మరో 25 ఏళ్లపాటు లోక్సభ సీట్లలో ఎటువంటి మార్పు తీసుకురావద్దని రేవంత్ అన్నారు. 25 ఏళ్ల వరకు పునర్విభజన చేయకూడదని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. సీట్ల సంఖ్యలో మార్పు లేకుండా పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని సిఎం రేవంత్ సూచించారు. పునర్విభజనకు రాష్ట్రాన్ని యూనిట్ తీసుకొని చేయాలని, రాష్ట్రాల్లోని జనాభా ఆధారంగా పునర్విభజన చేపట్టాలని సిఎం రేవంత్ డిమాండ్ చేశారు. రాష్ట్రాల్లోని నగరాలు, గ్రామాల్లోని జనాభా ఆధారంగా లోక్సభ సీట్ల హద్దులను మార్పు చేయాలని, తాజా జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ సీట్ల సంఖ్య పెంచాలని ఆయన సూచించారు. ప్రతి రాష్ట్రంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని,
దక్షిణాది రాష్ట్రాలకు 33 శాతం అంటే 272 సీట్లు ఇవ్వాలి
లోక్ సభ స్థానాల పెంపును మరో 25 ఏళ్లపాటు వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు. 543 సీట్లు ఉన్న లోక్సభలో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య 130 అని ఇది మొత్తం సీట్లలో 24 శాతమని ఆయన తెలిపారు. పునర్విభజన తర్వాత ఏర్పడే నూతన లోక్ సభలో తమకు 33 శాతం సీట్లు ఇవ్వాలన్నదే దక్షిణాది రాష్ట్రాలుగా డిమాండ్ చేస్తున్నామని రేవంత్ పేర్కొన్నారు. బిజెపి 50 శాతం సీట్లను పెంచాలనుకుంటే అలా పెరిగే 272 సీట్లతో మొత్తం లోక్ సభ సీట్ల సంఖ్య 815 అవుతుందని అందులో దక్షిణాది రాష్ట్రాలకు 33 శాతం అంటే 272 సీట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సీట్లను దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలకు ఇప్పుడున్న ప్రొరేటా ప్రాతిపదికన పంచవచ్చని సిఎం రేవంత్ సూచించారు. దేశంలో మిగిలిన సీట్లను ఉత్తరాది, ఇతర రాష్ట్రాలకు కేంద్రం తమ అభిమతం మేరకు పంచవచ్చని, అనుకున్న దానికంటే దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్య తగ్గిస్తే అది దేశ రాజకీయ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సిఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు.
దక్షిణాది రాష్ట్రాలను శిక్షించే విధానానికి కేంద్రం స్వస్తి పలకాలి
పార్లమెంట్ దేశానికి విధానపరమైన శాసనాలను రూపొందిస్తుందే తప్ప ప్రజలకు అవసరమైన చిన్న చిన్న సమస్యలపై నిర్ణయాలు చేయదని సిఎం రేవంత్ అన్నారు. ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలను స్థానిక సంస్థలు, రాష్ట్రాలు, శాసనసభ నియోజకవర్గాల పరిధిలోనే పరిష్కారమవుతాయని ఆయన పేర్కొన్నారు. తాను చేసే తుది డిమాండ్, చూపించే పరిష్కారం, జనాభా నియంత్రణకు సంబంధించిందని ఆయన పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలను శిక్షించే విధానానికి కేంద్రం స్వస్తి చెప్పాలన్నారు. దేశ నిర్మాణంలో 1975 నుంచి 2025 వరకు 50 ఏళ్ల పాటు మనం అందించిన సేవలకు మనల్ని అభినందించాలన్నారు. లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి దేశంలోని ఇతర రాష్ట్రాలతో సంబంధం లేకుండా చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీట్లను ఏర్పాటు చేసినట్లే దక్షిణాదికి అవకాశం ఇవ్వాలని రేవంత్ సూచించారు. మంచి ప్రగతి సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ సీట్లలో మంచి వాటా ఇవ్వడం ద్వారా ఇతర రాష్ట్రాలు ఆర్థిక వృద్ది, సుపరిపాలనపై దృష్టి సారించేలా చేయాలి.
పునర్విభజన ప్రక్రియపై తెలంగాణ శాసనసభలో కూడా త్వరలోనే తీర్మానం
దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు మన విభేదాలను విస్మరించి పునర్విభజనలో మన వాటా దక్కించుకునేందుకు ఐక్యంగా పోరాడాలని సిఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. పునర్విభజన ప్రక్రియపై తెలంగాణ శాసనసభలో కూడా త్వరలోనే తీర్మానం ఆమోదిస్తాని ఆయన తెలిపారు. మేం మా రాష్ట్రంలో ఎలా చేస్తున్నామో మీ మీ రాష్ట్రాల్లోనూ అలాగే చేయాలని సహచర ముఖ్యమంత్రులు, ఇతర నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. దక్షిణ భారతదేశ పౌరుల గళాన్ని బలంగా, ఐక్యంగా మొత్తం భారత దేశానికి వినిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
పునర్విభజన ప్రక్రియపై రెండో సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహిస్తా
పునర్విభజనకు వ్యతిరేకంగా తెలంగాణలోనూ సమావేశం పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించగా రేవంత్ ప్రతిపాదనకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అంగీకారం తెలిపారు. ఈ నేపథ్యంలోనే పునర్విభజన ప్రక్రియపై తర్వాత సమావేశాన్ని వచ్చేనెలలో హైదరాబాద్లో నిర్వహిస్తానని సిఎం రేవంత్ తెలిపారు. మన పోరాటాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలన్న విషయాన్ని ఆ సమావేశంలో చర్చిద్దామని సిఎం తెలిపారు. ఈ పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఒక భారీ బహిరంగ సభను తాను ఏర్పాటు చేస్తానని, దక్షిణ భారతదేశానికి చెందిన అన్నా తమ్ముళ్లు, అక్కా చెల్లెళ్లంతా కలిసి వచ్చి మన హక్కుల రక్షణకు కలిసి రావాలని సిఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. పునర్విభజనపై దక్షిణాదితో పాటు నష్టపోయే ఇతర రాష్ట్రాల గళాన్ని బలంగా వినిపించేందుకు ఆయా రాష్ట్రాల్లోని అన్ని పార్టీల ఎంపిలతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. దేశ రాజధాని ఢిల్లీలోనే అన్ని రాజకీయ పరమైన నిర్ణయాలు జరుగుతాయని, ఈ నేపథ్యంలో అక్కడ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పరస్పరం సమన్వయం చేసుకుంటూ భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనకు ఎంపిలతో కూడిన కమిటీ పని చేయాలని, ఇందుకు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దీంతో సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రులు, నాయకులు అంగీకరించడంతో ఢిల్లీలో ఆ కార్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
కేంద్రం ఏకపక్ష నిర్ణయాన్ని అందరం ముక్తకంఠంతో వ్యతిరేకించాలి: తమిళనాడు సిఎం స్టాలిన్
అంతకుముందు తమిళనాడు సిఎం స్టాలిన్ మాట్లాడుతూ ఈ సమావేశం చరిత్రలో నిలిచిపోతుందని ఆయన అన్నారు. కేంద్రం ఏకపక్ష నిర్ణయాన్ని అందరం ముక్తకంఠంతో వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతమున్న జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగనివ్వకూడదని ఆయన అన్నారు. పార్లమెంట్లో మన ప్రాతినిథ్యం పడిపోతే అభిప్రాయాలను కూడా చెప్పలేని పరిస్థితులు వస్తాయన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధుల కోసం మనం పోరాటం చేయాల్సి వస్తుందన్నారు. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా హైదరాబాద్లో దక్షిణాది రాష్ట్రాల రెండో సమావేశం రెండు రోజుల పాటు జరుగబోతోంది. ఇందులో దక్షిణాది రాష్ట్రాల నేతల భేటీ అవుతారు. ఈ సమావేశం తర్వాత బహిరంగ సభ నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. త్వరలో తేదీలు ఖరారు చేస్తామని తమిళనాడు సిఎం స్టాలిన్ ప్రకటించారు.
ఎలాంటి చర్చలు చేపట్టకుండానే పునర్విభజనా ?: కేరళ సిఎం
ఎలాంటి చర్చలు చేపట్టకుండానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్రం భావిస్తోందని, అలా జరిగితే అది మనకు డేంజర్ బెల్ లాంటిదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సిఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సహా పలువురు పాల్గొన్నారు.