Sunday, September 8, 2024

ఒరిజినల్ ఉంటేనే ఉచిత ప్రయాణం

- Advertisement -
- Advertisement -

మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకోవాలంటే ఒరిజినల్ చూపించాల్సిందే
పాన్‌కార్డు ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదు:  టిఎస్‌ఆర్టీసి ఎండి సజ్జనార్

మనతెలంగాణ/హైదరాబాద్: మహిళా ప్రయాణికులకు టిఎస్‌ఆర్టీసి ఎండి సజ్జనార్ కీలక విజ్ఞప్తి చేశారు. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని ఎండి సజ్జనార్ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డైనా ఈ పథకానికి వర్తిస్తుందన్నారు. అయితే పాన్ కార్డులో అడ్రస్ లేనందున అది ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు కాదని ఆయన స్పష్టం చేశారు. గుర్తింపు కార్డు లేకుంటే డబ్బులు చెల్లించాల్సిందేనని ఆయన తెలిపారు.
కొంతమంది స్మార్ట్ ఫోన్‌లలో, ఫొటో కాఫీలు చూపించి…
ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపించాలని పదే పదే చెబుతున్నా కొంతమంది స్మార్ట్ ఫోన్‌లలో, ఫొటో కాపీలు, కలర్ జీరాక్స్ లు చూపిస్తున్నారని టిఎస్ ఆర్టీసి ఉద్యోగులు యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవ్వడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని, మహిళా ప్రయాణికులందరూ ఒరిజనల్ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్ ను తీసుకోవాలని కోరుతున్నామని ఎండి సజ్జనార్ తెలిపారు. ఒరిజినల్ గుర్తింపు కార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంతం మహిళలకే వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు చార్జీ చెల్లించి విధిగా టికెట్ తీసుకుని సహకరించాలని ఆయన సూచించారు.
ఒక వేళ టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే…
ఎలాగూ ఉచితమే కదా అని కొందరు జీరో టికెట్ ఎందుకు తీసుకోవడమని సిబ్బందితో వాదనకు దిగుతున్నట్టు ఫిర్యాదులు అందాయని ఎండి తెలిపారు. ఇది సరికాదు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును టిఎస్ ఆర్టీసికి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. జీరో టికెట్ లేకుండా ప్రయాణిస్తే సంస్థకు నష్టం చేసిన వాళ్లవుతారని ఎండి సూచించారు. కావున ప్రతి మహిళా కూడా జీరో టికెట్ తీసుకోవాలన్నారు. ఒక వేళ టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే అది చెకింగ్‌లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుందని, అలాగే సదరు వ్యక్తికి రూ.500 జరిమానా విధించే అవకాశం ఉంటుందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ విధిగా టికెట్ తీసుకుని సహకరించాలని కోరుతున్నామని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News