నిర్వహణ కమిటీ చీఫ్ తొషిరో మూటో
టోక్యో: కరోనా వల్ల ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడలను ఏడాది పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇక, వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ క్రీడల షెడ్యూల్ను కూడా అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఇప్పటికే విడుదల చేసింది. అయితే టోక్యో ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ అధికారి తొషిరో మూటో మాత్రం వచ్చే ఏడాది కూడా ఒలింపిక్స్ క్రీడలు జరగడం సందేహమేనని శుక్రవారం బాంబు పేల్చారు. కరోనా సమస్య రోజురోజుకు తీవ్ర రూపం దాల్చడం, పరిస్థితులు క్లిష్టంగా మారడం తదితర కారణాల నేపథ్యంలో వచ్చే ఏడాది కూడా అనుకున్న సమయంలో క్రీడలను నిర్వహించడం సాధ్యం కాక పోవచ్చని తొషిరో అభిప్రాయపడ్డారు.
జపాన్ ప్రధాని షింజో అబె కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని తొషిరో మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు. కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి చాలా దయనీయంగా మారిందని, చాలా దేశాల్లో ఈ మహమ్మరి తీవ్రంగా ఉందని తొషిరో వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు తగినంత ప్రాక్టీస్ లభిస్తుందా లేదా అనేది సందేహమేనన్నారు. దీంతో క్రీడలను మరి కొంత కాలం పొడిగించి నిర్వహించినా ఆశ్చర్యం లేదన్నారు. అయితే క్రీడలు ఎప్పుడూ నిర్వహిస్తారే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అంతేగాక ప్రస్తుతం ప్రకటించిన షెడ్యూల్ను మార్చే విషయంపై కూడా ఇటు జపాన్ ప్రభుత్వం కానీ, ఒలింపిక్స్ కమిటీ కానీ ఎటువంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని తొషిరో స్పష్టం చేశారు.