Saturday, October 5, 2024

దళితుల హక్కులను లూటీ చేసిన ప్రతిపక్షాలు

- Advertisement -
- Advertisement -

మైనారిటీ హోదాతో విద్యాసంస్థలలో రిజర్వేషన్లకు మంగళం
ఓటు బ్యాంకు కోసం భవిష్యత్ తరాలను నాశనం చేస్తున్న కాంగ్రెస్
ప్రధాని మోడీ ఆరోపణలు

న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు తనపై చేస్తున్న వివిధ రాఓపణలను చెత్తగా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో 400కి పైగా సీట్లను ఎన్‌డిఎ కూటమి గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ప్రధాని మోడీ జూన్ 1న జరిగే చివరి దశ ఎన్నికల తర్వాత కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రతిపక్షాలకు ఈ చివరి దశ ఎన్నికలతో కథ సమాప్తమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికలలో రిజర్వేషన్లను తెరపైకి తీసుకువచ్చిన ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు. ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసి వర్గాలు ప్రతిపక్షాలను కొన్ని పార్టీలు దశాబ్దాలుగా లూటీ చేశాయని ఆరోపించారు.

రాత్రికిరాత్రే విద్యా సంస్థలను మైనారిటీ సంస్థలుగా ప్రతిపక్షాలు మార్చాయని ఆయన ఆరోపించారు. వెనుకబడిన తరగతులకు తాము సానుభూతిపరులమని చెప్పుకునే ప్రతిపక్షాలు నిజానికి దళితులు, గిరిజనులకు బద్ధ శత్రువులని ఆయన ఆరోపించారు. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీని ఉదహరిస్తూ ఆ యానివర్సిటీకి మైనారిటీ హోదా ఇచ్చి అక్కడ రిజర్వేషన్లను అంతం చేశాయని ఆయన చెప్పారు. అదే విధంగా దేశవ్యాప్తంగా దాదాపు 10,000 యూనివర్సిటీలు ఉన్నాయని, అక్కడ ఎస్‌సి, ఎస్‌టిల నుంచి రిజర్వేషన్ల హక్కును లాక్కున్నాయని ఆయన చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాజ్యాంగ స్ఫూర్తిని అతిక్రమించారని ఆయన విమర్శించారు. కాంగ్రెస మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్రలు స్పష్టంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. మైనారిటీ కోటా ఇవ్వడం ద్వారా తన ఓటు బ్యాంకును సంతృప్తి పరిచేందుకు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ తరాలను నాశనం చేస్తోందని ఆయన ఆరోపించారు.

దళితులు, ఎస్‌సిలు, ఓబిసి సోదర సోదరీమణుల కోసం పోరాడవలసిన బాధ్యత తనపైన ఉందని ఆయన స్పష చేశారు. బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను నిలిపివేస్తుందా అన్న ప్రశ్నకు కాంగ్రెస్ ఇప్పటికే ఆ పాపాన్ని మూటగట్టుకుందని, అందుకే అసత్యాలు ప్రచారం చేస్తున్నదని ఆయన విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌లో ఓబిసి సర్టిఫికెట్లను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించి ప్రశ్నించగా ముస్లింలకు చెందిన అన్ని కులాలను ఓబిసిలుగా రాత్రికి రాత్రే మార్చేశారని ఆయన ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్‌లో జరిగిన మోసాన్ని హైకోర్టు బట్టబయలు చేసినప్పటికీ న్యాయవ్యవస్థను సైతం ప్రతిపక్షం తిడుతోందని ఆయన విమర్శించారు.

జైలుకు ఎవరు వెళ్లాలో ప్రధాని నిర్ణయిస్తారన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా అలా మాట్లాడేవారు భారత రాజ్యాంగాన్ని చదివితే మంచిదని మోడీ ఎద్దేవా చేశారు. అలా మాట్లాడేవారికి తాను ఏమి చెప్పగలనని ఆయన అన్నారు. తనను ఏ తిట్లు తాకవని ఆయన చెప్పారు. నిరాశానిస్పృహల్లో ఉన్న ప్రతిపక్షాల నాయకులు దుర్భాషను ఉపయోగించడాన్ని అలవాటుగా చేసుకున్నారని ప్రధాని విమర్శించారు. ప్రతిపక్షాలు తనపైన చేస్తున్న వేర్వేరు ఆరోపణలను చెత్తగా అభివర్ణించిన మోడీ ఆ చెత్తలో నుంచి ఎరువులు సృష్టించి దేశానికి మంచి చేస్తానని వ్యాఖ్యానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News