డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
మన తెలంగాణ / హైదరాబాద్ : దావత్ ఏ ఇఫ్తార్ ను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం అసెంబ్లీ సమావేశ మందిరంలో ఇఫ్తార్ విందు, రంజాన్ పండుగ ఏర్పాట్లను ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి సమీక్షించారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే ఈ కార్యక్రమాలకు ఎలాంటి నిధుల కొరత లేదని డిప్యూటీ సీఎం తెలిపారు. ఆహారంలో నాణ్యత, ప్రోటోకాల్, సౌకర్యాల కల్పనలో అధికారులు ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం తెలిపారు. ఏర్పాట్లలో అధికారులు ఏమాత్రం అశ్రద్ధ వహించరాదని, చిన్న పొరపాటుకు అవకాశం లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం తెలిపారు.
లా అండ్ ఆర్డర్, ఎలక్ట్రిసిటీ, మంచినీరు వాటి అంశాలు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరారు. ఏర్పాట్లలో ఎలాంటి అనుమానాలు, ఇబ్బందులు ఎదురైనా అధికారులు మొహమాట పడకుండా జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ లేదా తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఏర్పాట్లకి సంబంధించి రోజువారీ సమీక్షను ప్రభుత్వ సలహాదారు, ఏర్పాట్ల కమిటీ వైస్ చైర్మన్ షబ్బీర్ అలీ రోజువారీ సమీక్ష చేస్తారని తెలిపారు. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులకు ఏలాంటి అసౌకర్యం లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, దావత్ ఏ ఇఫ్తార్ కు కూడా ఘనంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం దావత్ ఏ ఇఫ్తార్ ను ఘనంగా నిర్వహిస్తుందన్నారు. సమావేశంలో అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.