రక్షణ కమిటీ సమావేశానికి రాహుల్ హాజరు
పార్లమెంట్ ప్రాంగణంలో రక్షణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ భేటీ
ప్రధాని మోడీతో రక్షణ మంత్రి రాజ్నాథ్, ఎన్ఎస్ఎ దోవల్ సమీక్ష
భద్రత వైఫల్యం, ప్రభుత్వ స్పందనపై ప్రతిపక్షాల ప్రశ్నలు
న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిన నేపథ్యంలో ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతుండగా, కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తోంది. ప్రతీకార చర్యలకు భారత్ సిద్ధం అవుతోందన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీలకు ప్రాతినిధ్యం ఏర్పడింది. సోమవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశం అయ్యారు. ఈ భేటీలో జాతీయ భద్రత సలహాదారు (ఎన్ఎస్ఎ) అజిత్ దోవల్ పాల్గొన్నారు. సుమారు 40 నిమిషాల సేపు సాగిన ఈ సమావేశంలో పహల్గాంలో తాజా పరిస్థితులు, భద్రత బలగాల సన్నద్ధత, సైన్యం తీసుకున్న కీలక నిర్ణయాలను రాజ్నాథ్ సింగ్ ప్రధానికి వివరించినట్లు సమాచారం.
అంతకుముందు ఆదివారం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ అనిల్ చౌహాన్తో రాజ్నాథ్ సింగ్ సమావేశమై భారత్ తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ఆ భేటీలో తీసుకున్న నిర్ణయాల గురించి కూడా ప్రధానికి నివేదించినట్లు తెలుస్తోంది. మరొక వైపు, పార్లమెంట్ ప్రాంగణంలో రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సోమవారం సమావేశమైంది. ఈ భేటీకి కమిటీ సభ్యులు రాధామోహన్ సింగ్, విష్ణుపాల్ రే, జగన్నాథ్ సర్కార్, శక్తి సింగ్ గోహిల్, సంజయ్ సింగ్, లోక్సభలోని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రభృతులు హాజరయ్యారు. పహల్గాం దాడి అనంతర పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
భద్రత వైఫల్యంపై ప్రతిపక్షాల విమర్శలు
కేంద్రం ఇటీవల నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో పహల్గాం ఘటనపై ప్రతిపక్షాల ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఇదిస్పష్టమైన భద్రత వైఫల్యమని, దాడి జరిగిన వెంటనే ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదని పలువురు నేతలు విమర్శించారు. దాడి సమయంలో భద్రతా దళాలు, సిఆర్పిఎఫ్ జవాన్లు ఎక్కడ ఉన్నారని వారు ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి ఒకరు స్పందిస్తూ, సాధారణంగా అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యే జూన్ వరకు పర్యాటకులను ఆ ప్రాంతానికి అనుమతించరని, కానీ ఈ సారి స్థానిక అధికారులు భద్రతా ఏజెన్సీలకు సమాచారం ఇవ్వకుండానే బైసరన్కు పర్యాటకులను అనుమతించారని తెలియజేశారు.