న్యూఢిల్లీ : రెండు పొరుగు దేశాల నుంచి ఏక కాలంలో భారత్కు యుద్ధం ముప్పు పొంచి ఉందని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో సైనిక సన్నద్ధత, సరిహద్దుల వెంబడి పరిస్థితులు, బంగ్లాదేశ్ తదితర అంశాలపై అడిగిన ప్రశ్నలకు ద్వివేది సమాధానం ఇచ్చారు. భారత్కు వ్యతిరేకంగా చైనా, పాకిస్తాన్ కుమ్మక్కు అవుతున్నాయని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఉగ్రవాదానికి కేంద్ర బిందువు అయిన పాక్ మన పొరుగున ఉన్న ఏ దేశంతోనైనా సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం ఆందోళనకరమని ఆర్మీ చీఫ్ అన్నారు.
ఎందుకంటే ఆ దేశాన్ని కూడా పాక్ ఉగ్రవాద చర్యలకు ఉపయోగించుకునే అవకాశం ఉండడమేనని ఆయన అన్నారు. చైనాలో తయారైన సైనిక ఉత్పత్తులను పాక్ వినియోగిస్తోందని, కుమ్మక్కుకు సంబంధించి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇది అని ఆయన చెప్పారు. ఆ రెండు దేశాల మధ్య కుట్రపూరిత సంబంధాలు ఉన్నాయన్న వాస్తవాన్ని భారత్ అంగీకరించక తప్పదని ఆయన స్పష్టం చేశారు. బంగ్లాదేశ్కు సంబంధించి ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటు అవుతుందని ఆయన అన్నారు. అయితే, భారత్, బంగ్లాదేశ్ మధ్య సైనిక బంధం బలంగానే ఉందని ద్వివేది తెలిపారు.