Sunday, July 7, 2024

హైదరాబాద్ మనదే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో అవశేష ఎపి, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేండ్ల గడువు జూన్ 1వ తేదీ అర్ధరాత్రి ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ తో ఉన్న పదేండ్ల ఉమ్మడి రాజధాని బంధం సమాప్తమైంది. హైదరాబాద్ పూర్తిస్థాయిలో తెలంగాణ రాజధానిగా కొనసాగనున్నది. దాదాపు పదేండ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగేలా విభజన చట్టంలో సెక్షన్ 5 ప్రకారం స్పష్టత, వెసులుబాటు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ మాత్రం తన పరిపాలనా కేంద్రాన్ని హైదరాబాద్ నుంచి ఆ రాష్ట్రానికి తరలించుకున్నది. అక్కడే సొంతంగా సచివాలయం, అసెంబ్లీ, రాజ్‌భవన్, హైకోర్టులను నిర్మించుకున్న ది. దీంతో ఆచరణలో ఆ రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగుతున్నా విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ మాత్రం ఉమ్మడి రాజధానిగా కొనసాగింది. ఉమ్మడి రాష్ట్ర విభజనతో అవశేష ఆంధ్రప్రదేశ్, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాలకు హై దరాబాద్ నగరం 2014 జూన్ 2వ తేదీ నుంచి ఉ మ్మడి రాజధానిగా కొనసాగింది. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పదేళ్లపాటు హైదరాబాద్ ఉ మ్మడి రాజధానిగా కొనసాగాలన్న నిబంధనతో 2024 జూన్ 1వ తేదీ
అర్ధరాత్రి వరకు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చెల్లుబాటు కాగా, అర్ధరాత్రి తర్వాత నుంచి హైదరాబాద్ నగరం కేవలం తెలంగాణ రాష్ట్రానికే పూర్తిస్థాయి రాజధానిగా ఉండనున్నది.

దీంతో ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ వాడుకున్న లేక్ వ్యూ గెస్ట్ హౌజ్, లక్డీకాపూల్‌లో పోలీసు శాఖకు చెందిన భవనం (ఎపి సిబిసిఐడి అవసరాలకు), హెరిటేజ్ బిల్డింగ్ ఇక నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి రానున్నాయి. ఆ మూడు భవనాలను వెంటనే స్వాధీనం చేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల నిర్వహించిన సమావేశంలో అధికారులకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ కారణంగా విభజన చట్టం అంశంపై విధాన నిర్ణయాలు వద్దని, కేబినెట్ ఎజెండాలోని ఈ అంశాన్ని పక్కన పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయలేదు. హైదరాబాద్ నగరంలోని ఆ మూడు భవనాలను వెంటనే ఎపి ఖాళీ చేయాల్సి ఉంటుంది. విభజన చట్టం ప్రకారం జూన్ 1వ తేదీ అర్ధరాత్రి తర్వాత ఈ భవనాలపై ఎపికి ఎలాంటి అజమాయిషీ ఉండదు. ఈ మూడు భవనాలను అద్దెకు లేదా లీజుకు ఇవ్వాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే అభ్యర్థన వచ్చినట్లు తెలంగాణ సచివాలయ వర్గాలు తెలిపాయి. కానీ.. ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. లేక్ వ్యూ గెస్ట్ హౌజ్‌ను తెలంగాణ కొన్ని ప్రత్యేక అవసరాలకు వాడుకోవాలని భావిస్తున్నది.

దీంతో అద్దె లేదా లీజ్‌కు ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ అని ఆ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ రాజ్‌భవన్‌కు సమీపంలో ఉండడంతో దానిని సిఎం క్యాంపు కార్యాలయంగా వాడుకోవడంపై ప్రభుత్వ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. పోలీసు శాఖకు చెందిన భవనంపై, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అవసరాలకు వాడుతున్న హెర్మిటేజ్ భవనంపైనా ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశమున్నది. అప్పటికి ఎలక్షన్ కోడ్ ముగుస్తున్నందున మంత్రివర్గంలో చర్చించి విధానపరమైన నిర్ణయం తీసుకుని ఖరారు చేయనున్నది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ మూడు భవనాలపై రెండు రాష్ట్రాల మధ్య జరిగే సంప్రదింపులకు అనుగుణంగా స్పష్టత వచ్చే అవకాశముంటుంది. మంత్రివర్గ సమావేశంలో చర్చించి స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోనుంది.

పరిష్కారానికి నోచుకోని విభజన హామీలు
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌పై ఎపికి ఎలాంటి అజమాయిషీ లేకపోయినప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని అనేక సమస్యలపై కేంద్ర హోంశాఖ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉన్నది. కొన్ని విదాదాలు న్యాయస్థానం పరిధిలో ఉండగా మరికొన్ని రెండు రాష్ట్రాల మధ్య సంప్రదింపుల దశలో ఉన్నా యి. ఆస్తులు, అప్పుల విభజనతోపాటు కొన్ని డిపార్టుమెంట్ల హెడ్ క్వార్టర్ నిర్వచనంతో బ్యాంకు ఖాతాల్లోని డిపాజిట్ల పంపిణీ జరగాల్సి ఉన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News